
న్యూఢిల్లీ: చైనాతో బార్డర్లో నెలకొన్న ఉద్రిక్తతలపై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మరోమారు స్పందించారు. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. ఇండో-చైనా దళాల మధ్య ఎనిమిదో రౌండ్ మిలిటరీ చర్చలు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘వైరుధ్యాలు వివాదాలుగా మారకూడదనే దాన్ని మేం నమ్ముతాం. వైరుధ్యాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మేం ప్రాముఖ్యతను ఇస్తున్నాం. బార్డర్లో శాంతి, సుస్థిరతను నెలకొల్పే ఒప్పందాలను మేం గౌరవిస్తున్నాం’ అని నేషనల్ డిఫెన్స్ కాలేజీ డైమండ్ జూబ్లీ కార్యక్రమంలో రాజ్నాథ్ చెప్పారు.