- నిరాశపర్చిన ప్రణయ్
- చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్
షెన్జెన్: ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు, ఆసియా గేమ్స్ చాంపియన్స్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి.. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో సెమీస్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్సీడ్ సాత్విక్–చిరాగ్ 21–16, 21–14తో వరల్డ్ 13వ ర్యాంకర్లు లియో రాలీ కర్నాడో–డానియెల్ మార్తిన్ (ఇండోనేసియా)పై గెలిచారు. ఈ ఏడాది ఇండోనేసియా, కొరియా, స్విస్ ఓపెన్ గెలిచి జోరుమీదున్న ఇండియన్ ద్వయం ఈ టోర్నీలోనూ అదే ఫామ్ను కొనసాగించింది. 46 నిమిషాల మ్యాచ్లో సాత్విక్–చిరాగ్ అటాకింగ్ గేమ్తో అదరగొట్టారు. క్రమం తప్పకుండా తమ పొజిషన్స్, డైరెక్షన్స్ మార్చుకుంటూ ఇండోనేసియన్లను ఇబ్బంది పెట్టారు.
ఆరంభంలో రెండు జోడీలు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడాయి. దీంతో స్కోరు 9–9, 14–14తో సమమైంది. ఇక్కడి నుంచి ఇండియా జంట బలమైన స్మాష్లతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 17–14 లీడ్లోకి వచ్చింది. ఈ టైమ్లో లియో–డానియెల్ రెండు పాయింట్లు నెగ్గినా.. చివర్లో నాలుగు పాయింట్లు గెలిచిన సాత్విక్ ద్వయం గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో సాత్విక్–చిరాగ్ ర్యాలీలతో ఆకట్టుకున్నారు.
6–5 ఆధిక్యం వద్ద వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి లీడ్ను10–5కు పెంచుకున్నారు. 10-–17 స్కోరు వద్ద ఇండోనేసియా ప్లేయర్లు మూడు పాయింట్లు గెలిచినా పెద్దగా లాభం జరగలేదు. ఆ వెంటనే సాత్విక్ 48 షాట్స్ ర్యాలీని స్మాష్తో ముగించి వరుసగా మూడు పాయింట్లు సాధించాడు. చివరకు 20–14 వద్ద సూపర్ డ్రాప్తో మ్యాచ్ ఇండియా జోడీ సొంతమైంది.
ప్రణయ్ ఔట్
వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హతే లక్ష్యంగా బరిలోకి దిగిన హెచ్.ఎస్. ప్రణయ్కు నిరాశే ఎదురైంది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో ప్రణయ్ 9–21, 14–21తో మూడోసీడ్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. 43 నిమిషాల మ్యాచ్లో ప్రణయ్.. నరోకాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయాడు. 1–3తో తొలి గేమ్ను మొదలుపెట్టిన అతను 4–4తో స్కోరును సమం చేసినా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు.
నరోకా వరుస పాయింట్లతో దూసుకుపోయాడు. రెండో గేమ్లో కాస్త పుంజుకున్న ప్రణయ్ గట్టి పోటీ ఇచ్చాడు. సుదీర్ఘమైన ర్యాలీలు ఆడుతూ, క్రాస్ కోర్టు విన్నర్స్తో 12–12తో స్కోరును సమం చేశాడు. కానీ ఇక్కడి నుంచి మళ్లీ గాడి తప్పాడు. నరోకా వరుసగా మూడు, నాలుగు పాయింట్లు సాధించి 19–14 లీడ్లో నిలిచాడు. చివర్లో ఈజీగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను ఖాతాలో వేసుకున్నాడు.
వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్త్ దక్కేనా
డిసెంబర్ 13 నుంచి 17 వరకు జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించాలంటే బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్–8లో ఉండాలి. ప్రస్తుతం సాత్విక్–చిరాగ్ జోడీ 13వ ర్యాంక్ (69, 240 పాయింట్లు)లో ఉంది. ఒకవేళ చైనా మాస్టర్ టోర్నీ నెగ్గితే ర్యాంకింగ్ మరింత మెరుగయ్యే చాన్స్ ఉంది. మెన్స్ సింగిల్స్లో ప్రణయ్ 14వ ర్యాంక్ (67,190 పాయింట్లు)లో కొనసాగుతున్నాడు.
లక్ష్యసేన్ 17వ ర్యాంక్ (64,760 పాయింట్లు)లో ఉండగా, ఈ టోర్నీకి దూరంగా ఉన్న పీవీ సింధు విమెన్స్ సింగిల్స్లో 15వ (64, 990 పాయింట్లు) ర్యాంక్లో నిలిచింది. కాగా, ఈ టూర్లో ఈ నెల 28 నుంచి జరిగే సయ్యద్ మోదీ సూపర్ 300 టోర్నీ చివరిది కానుంది.