బెంగళూరు: డేవిస్ కప్లో ఇండియా టెన్నిస్ టీమ్ క్వాలిఫయర్స్ రౌండ్–2కు అర్హత సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్తో ముగిసిన క్వాలిఫయర్స్–1 పోరులో ఇండియా 3–2తో విజయం సాధించింది. మెన్స్ డబుల్స్ మ్యాచ్లో యూకీ బాంబ్రీ–దక్షిణేశ్వర్ సురేశ్ 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్ అరెండ్స్–డేవిడ్ పెల్పై గెలిచారు.
3 గంటల పాటు జరిగిన మ్యాచ్లో ఇండియా ద్వయం రెండో సెట్ కోల్పోయినా డిసైడర్లో అద్భుతంగా పోరాడింది. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో టైబ్రేక్లో విజయాన్ని అందుకుంది. అయితే రివర్స్ సింగిల్స్లో సుమిత్ నగాల్ 7–5, 1–6, 4–6తో జాస్పెర్ డి జోంగ్ చేతిలో ఓడటంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమమైంది. తొలిసెట్లో మెరుగ్గా ఆడిన నగాల్.. తర్వాతి రెండు సెట్లలో నిరాశపర్చాడు.
బలమైన సర్వీస్లు కొట్టినా.. ప్రత్యర్థి సర్వీస్లను రిటర్న్ చేయడంలో ఫెయిలయ్యాడు. స్కోరు 2–2తో సమం కావడంతో రివర్స్ సింగిల్స్పై ఉత్కంఠ పెరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణేశ్వర్ సురేశ్ 6–4, 7–6 (7/4)తో గై డి ఔడెన్ను ఓడించి ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన దక్షిణేశ్వర్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
