హైదరాబాద్: హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న 6వ 'వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ జీఎమ్ఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగెట్టా 2026' పోటీలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన ఆప్టిమిస్టక్ మెయిన్ రేసులో బాలుర, బాలికల టైటిల్స్ను వరుసగా బి. రవి కుమార్ (టీఎస్ఏ), శృంగారి రాయ్ (ఎస్ఎస్సీ) కైవసం చేసుకున్నారు. ప్రస్తుత జాతీయ చాంపియన్లుగా ఉన్న వీరిద్దరూ ఒక రేసు మిగిలి ఉండగానే అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నారు.
ఆప్టిమిస్టిక్ గ్రీన్ విభాగంలో నేతికోపుల సింధు (టీఎస్ఏ) ఒక్క పాయింట్ ఆధిక్యంతో టాప్లో కొనసాగుతుండగా, అన్యా రెడ్డి (ఎస్ఎస్సీ), రోష్ని కశ్యప్ (టీఎస్ఏ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 'ఐఎల్సీఏ 4' బాలుర విభాగంలో ప్రీత్ సివాల్ (ఇండియన్ నేవీ), రాహుల్ సోనార్ మధ్య కేవలం ఒకే ఒక్క పాయింట్ తేడా ఉంది. బాలికల్లో తులసి పటేల్ ఎనిమిది రేసుల్లో గెలిచి ఇప్పటికే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కృత్తిక విశ్వనాథన్ రెండో స్థానంలో నిలిచింది.
