
- ఇండియా, అమెరికా ట్రేడ్ డీల్లో కుదరనున్న ఒప్పందం
- బయోఫ్యూయల్ కోసం ఇథనాల్ దిగుమతులను బ్యాన్ చేసిన ఇండియా
న్యూఢిల్లీ: ఇండియా, అమెరికాతో ఒక పెద్ద ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా యూఎస్ నుంచి కొనుగోలు చేసే ఇథనాల్పై రిస్ట్రిక్షన్స్ ఎత్తేయవచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇథనాల్ను ఇంధనేతర అవసరాల కోసం మాత్రమే దిగుమతి చేసుకోవడానికి ఇండియా అనుమతి ఇస్తోంది. అమెరికా మాత్రం పెట్రోల్లో కలపడం కోసం, బయోఫ్యూయల్గా వాడడానికి దిగుమతి చేసుకోవాలని కోరుతోంది.
ప్రభుత్వం లోకల్గా తయారీని పెంచేందుకు ఇథనాల్ దిగుమతులపై రిస్ట్రిక్షన్లు పెట్టింది. లోకల్గా బయోఫ్యూయల్స్ తయారీని ప్రమోట్ చేస్తోంది. క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకోవాలని చూస్తోంది. పెట్రోల్లో 20 శాతం వరకు ఇథనాల్ను బ్లెండింగ్ చేయడం మొదలు పెట్టింది. దీనిని పెట్టుకున్న టార్గెట్ కంటే ఐదేళ్లు ముందే చేరుకుంది. చెరకు రసం, మొక్క జొన్న, పాడయిన ఆహార పదార్థాల లాంటి రా మెటీరియల్స్తో ఇథనాల్ తయారు చేయాలని కంపెనీలను ప్రోత్సహిస్తోంది.
వ్యవసాయ రంగమే అమెరికా టార్గెట్
అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గించాలని ఇండియాను కోరుతోంది. ఇండియన్ గవర్నమెంట్ మాత్రం వ్యవసాయ రంగాన్ని సెన్సిటివ్ సెక్టార్గా పరిగణిస్తోంది. దీంతో ఈ ఉత్పత్తుల దిగుమతులపై భారీగా టారిఫ్లు వేస్తోంది. ఇండియా మార్కెట్ "పూర్తిగా క్లోజ్డ్" అని యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కామెంట్ చేశారు కూడా. ఇండియా, యూఎస్ ట్రేడ్ చర్చలు వ్యవసాయ ఉత్పత్తులు, ఈ-కామర్స్, డేటా స్టోరేజ్ లాంటి 19 ఏరియాలను కవర్ చేయొచ్చని బ్లూమ్బెర్గ్ గత నెలలో రిపోర్ట్ చేసింది. కానీ రిస్ట్రిక్షన్లు తగ్గిస్తే ఇండియా నష్టపోతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఇండియా యూఎస్తో వ్యాపార చర్చలు మొదలు పెట్టింది. అన్ని అమెరికన్ గూడ్స్పై టారిఫ్స్ ఎత్తేయడానికి ఇండియా ముందుకొచ్చిందని ఈ నెల 15న ఖతార్లో ప్రెసిడెంట్ ట్రంప్ కామెంట్ చేశారు. కానీ, కొన్ని గంటల్లోనే ఇండియా ఫారిన్ మినిస్టర్ ఎస్. జైశంకర్ ఆ మాటలను తోసిపుచ్చారు. చర్చలు ఇంకా జరుగుతున్నాయని క్లారిఫై చేశారు. కామర్స్ మినిస్టర్ పియూష్ గోయల్ ఈ వీకెండ్లో మరిన్ని చర్చల కోసం యూఎస్ వెళ్తున్నారు. ఆయన పర్యటన తర్వాత ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్పై ఓ క్లారిటీ వస్తుంది.