
ఇండియన్ సినిమా మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంది. దర్శకురాలు పాయల్ కపాడియా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘గ్రాండ్ ప్రిక్స్’ అవార్డును గెలుచుకున్నారు. ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ అనే చిత్రానికి గాను ఆమెను ఈ అవార్డు వరించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండవ అత్యున్నత పురస్కారం ఇది. ఈ అవార్డును అందుకున్న మొదటి ఇండియన్ ఫిల్మ్ మేకర్గా పాయల్ కపాడియా చరిత్ర సృష్టించారు.
దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే ఆమె ఈ అవార్డును అందుకోవడం విశేషం. గతంలో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన ‘స్వహం’ (1994) సినిమా కేన్స్లో పోటీ పడగా.. 30 ఏళ్ల తర్వాత ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ పోటీలో నిలిచింది. శనివారం ఫిల్మ్ ఫెస్టివల్ క్లోజింగ్ సెర్మనీలో ఈ అవార్డును అందజేశారు. అమెరికన్ టి వొయిలా డేవిస్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న కపాడియా... తన స్పీచ్లో ‘మరో ఇండియన్ సినిమాను ఫీచర్ చేయడానికి 30 ఏళ్లు ఆగకండి ప్లీజ్’ అని ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు.
ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం గర్విస్తోందని, కొత్తతరం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్కు ఆమె స్ఫూర్తినిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఇక ఈ సినిమా కంటెంట్ విషయానికొస్తే.. మధ్యతరగతి యువతుల జీవితాలు, వారి భావోద్వేగాల నేపథ్యంలో జరిగే కథ. ముంబై నర్సింగ్ హోమ్లో కేరళకు చెందిన ఇద్దరు నర్సులు పని చేస్తుంటారు.
వీళ్లిద్దరూ తమ రిలేషన్షిప్స్లో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఇద్దరూ కలిసి ఓ బీచ్ టౌన్కు రోడ్ ట్రిప్కు వెళ్లగా అక్కడ ఓ అడివి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. వారి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. ఛాయా కదమ్, దివ్య ప్రభ, కనీ కుశృతి లీడ్ రోల్స్ చేశారు. మలయాళ, హిందీ, మరాఠి భాషల్లో తెరకెక్కించారు. 2021లో తీసిన ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ అనే డాక్యుమెంటరీకి కూడా కపాడియా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును అందుకున్నారు.