
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మరోసారి భారత్పై నోరుపారేసుకున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను భారత్ రెచ్చగొడుతున్నదని ఆరోపణలు చేశారు. శనివారం (జూన్ 28) కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ మాట్లాడారు.
‘‘భారత్ మాపై అకారణంగా రెండుసార్లు దాడులు చేసింది. ఆ దేశానికి దూరదృష్టి లేకుండాపోయింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. మాపై మళ్లీ దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తాం” అని హెచ్చరించారు. ‘‘భారత ఆర్మీ దాడులను దీటుగా ఎదుర్కొన్నాం. ఆ దేశం రెచ్చగొట్టినప్పటికీ మేం సంయమనం పాటించాం. శాంతికి కట్టుబడి ఉన్నాం” అని చెప్పారు.
తమ దేశం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పోరాడుతుంటే, భారత్ మాత్రం కావాలని ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఆరోపించారు. కాశ్మీర్ సమస్యపై స్పందిస్తూ.. ‘‘భారత దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాశ్మీర్ సోదరుల త్యాగాన్ని మనం గుర్తుచేసుకోవాలి. కాశ్మీర్ సమస్యపై యూఎన్ తీర్మానాలు, కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాక్ పోరాటం చేస్తుంది” అని పేర్కొన్నారు.