న్యూఢిల్లీ: చంద్రయాన్2 మిషన్లో ల్యాండింగ్ ఫెయిలైనా.. రెట్టించిన ఉత్సాహంతో మరో మూన్ మిషన్కు ఇండియా సిద్ధమవుతోంది. జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కలిసి లూనార్ పోలార్ ఎక్స్ప్లొరేషన్(ఎల్పీఈ) మిషన్ను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్లో ఇస్రోనే కీలక పాత్ర పోషించనుంది. ప్రయోగానికి సంబంధించిన ల్యాండర్ సిస్టమ్ను ఇస్రోనే తయారు చేయనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను జాక్సా వెల్లడించింది. 2022లో ఇస్రో ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ ఉన్నందున 2023లో ఎల్పీఈ మిషన్ చేపట్టనున్నట్టు జాక్సా ప్రకటించింది. ఈ ప్రయోగంలోనూ ల్యాండర్, రోవర్లుంటాయని చెప్పింది. ల్యాండింగ్ మాడ్యూల్, రోవర్ను జాక్సానే తయారు చేయనుండగా, ఆ ల్యాండింగ్ సిస్టమ్ను మాత్రం ఇస్రో డెవలప్ చేయనుంది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ తయారుచేసిన హెవీ రాకెట్ హెచ్3తో ఎల్పీఈ ప్రయోగం చేయనున్నారు. జపాన్ నుంచే లాంచ్ చేస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రాజెక్ట్ టీమ్.. కొలాబరేటివ్ మిషన్ను సమగ్రంగా నిర్వహించే విధానంపై పనిచేస్తోంది. అందులో భాగంగా స్పేస్క్రాఫ్ట్ సిస్టమ్ అవసరాలు, ఇంకొన్ని ఇంటర్ఫేస్ స్పెసిఫికేషన్స్పై ఇస్రో సాయం తీసుకుంటోంది.
మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి?
మునుపటి మిషన్లలాగే చందమామపై నీటి జాడలను గుర్తించేందుకు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఉన్న అబ్జర్వేషన్ల ద్వారా కచ్చితమైన నీటి పరిమాణాన్ని తెలుసుకోవడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. మిషన్ కోసం చంద్రుడి ధ్రువాలను టార్గెట్గా చేసుకున్నారు. ధ్రువాల వద్ద నీళ్లు ఎంతమేర విస్తరించి ఉన్నాయి.. దాని పరిస్థితులు, ఏ రూపంలో ఉన్నాయి.. వంటి వివరాలనూ ఈ ప్రయోగం ద్వారా తేల్చనున్నారు. శాశ్వతంగా చీకటి ఉండే ప్రాంతాల్లో (పీఎస్ఆర్) నీళ్లు సబ్లైమేట్ (గడ్డకట్టిన లేదా క్రిస్టల్) రూపంలో లేవంటూ ఇటీవలి స్టడీల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తేల్చేందుకే ఇస్రో, జాక్సాలు కలిసి ఈ ప్రయోగం చేస్తున్నాయి.
ఇంటర్నేషనల్ కొలాబరేషన్లో భాగంగా ఇస్రోతో కలిసి ఎల్పీఈ మిషన్ చేపట్టాం. భవిష్యత్ ప్రయోగాలకు అక్కడ గుర్తించిన వనరులను ఎలా వాడుకోవచ్చో ఈ మిషన్లో తేలుస్తాం. అంతేగాకుండా భవిష్యత్ చంద్రుడి ప్రయోగాల కోసం తక్కువ గురుత్వాకర్షణ ఉన్న అంతరిక్ష గ్రహాలు, గ్రహ శకలాల ఉపరితలాలను స్టడీ చేసేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేస్తాం. కెమికల్ ఎలిమెంట్స్ (రసాయన మూలకా లు) అబ్జర్వేషన్ కోసం రోవర్ను తయారు చేస్తున్నాం. హైడ్రోజన్ ఆనవాళ్లు కనిపిస్తే ఆ శాంపిళ్లను రోవర్ తీసుకుంటుంది. వాటిని అక్కడే హీట్చేసి ఆవిరిగా మార్చడం ద్వారా అందులోని రసాయన మూలకాలు, నీటి పరిమాణం, ఐసోటోపిక్ అనాలసిస్ చేస్తాం.
– జాక్సా, జపాన్ స్పేస్ ఏజెన్సీ