
భారతదేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 9 వేల 531 మందికి కరోనా సోకినట్లు కేంద్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మరో 36 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.
రికవరీ రేటు 98.59 శాతంగా ఉందని వెల్లడించింది. యాక్టివ్ కేసులు 0.22 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉందన్నారు. మొత్తంలో కేసులు 44,348,960గా ఉండగా..మొత్తం మరణాలు 5,27,368 సంభవించాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఆదివారం 35,33,466 మందికి టీకాలు అందించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,10,02,40,361కు చేరింది. ఒక్కరోజే 2,29,546 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.