బెంగళూరు: సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (శాఫ్) చాంపియన్షిప్లో ఇండియా ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా పెనాల్టీ షూటౌట్లో 4–2తో లెబనాన్ జట్టును ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ట్రా టైమ్లోనూ ఇరు జట్లూ ఖాతా తెరువలేకపోయాయి. దాంతో ఆట షూటౌట్కు దారి తీసింది. ఇందులో వరుసగా నాలుగు ప్రయత్నాల్లో ఇండియా ప్లేయర్లు సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్ స్కోర్లు సాధించారు.
మరోవైపు లెబనాన్ నాలుగు షాట్లలో రెండే గోల్స్ చేసింది. ఆ టీమ్ ప్రయత్నాలను అడ్డుకున్న ఇండియా గోల్ కీపర్ గుర్మీత్ సింగ్ సంధు ఆతిథ్య జట్టును ఫైనల్ చేర్చాడు. మరో సెమీస్లో కువైట్ 1–0తో బంగ్లాదేశ్ను ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో ఇండియా, కువైట్ అమీతుమీ తేల్చుకుంటాయి.