ముంబై: టీమిండియా స్పీడ్స్టర్, హైదాబాదీ మహ్మద్ సిరాజ్ అసలు ఈ టైమ్లో ముంబైలో ఉండాలని కానీ, టీ20 వరల్డ్ కప్ ఆడతానని కానీ కలలో కూడా ఊహించలేదు. నిజానికి అతను జర్మనీలో హాలిడే ఎంజాయ్ చేయాలని, అక్కడి నుంచి స్పెయిన్ వెళ్లి రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ మ్యాచ్ చూడాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ, విధి మరోలా తలచింది.
యంగ్ పేసర్ హర్షిత్ రాణా గాయపడటంతో వరల్డ్ కప్ టీమ్లోకి సిరాజ్కు అనూహ్యంగా పిలుపు వచ్చింది. బుమ్రా అనారోగ్యం బారిన పడటంతో అంతే అనూహ్యంగా శనివారం అమెరికాతో తొలి మ్యాచ్లో బరిలోకి దిగిన హైదరాబాద్ పేసర్.. నార్మల్ టార్గెట్ను కాపాడే ప్రయత్నంలో మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాకు హీరో అయ్యాడు. తనకు కెప్టెన్ సూర్య కుమార్ ఫోన్ చేసి ముంబై రమ్మంటే అస్సలు నమ్మలేదని సిరాజ్ చెప్పాడు.
‘హాలిడే ప్లాన్లో ఉన్న నాకు సడన్గా సూర్య భాయ్ ఫోన్ చేసి.. బ్యాగ్ సర్దుకొని వెంటనే వచ్చేయ్ అన్నాడు. తను జోక్ చేస్తున్నాడేమో అని నేను నమ్మలేదు. కానీ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓఝా నుంచి కూడా కాల్ రావడంతో షాక్ అయ్యాను’ అని వరల్డ్ కప్లో సిరాజ్ తన ఎంట్రీ గురించి చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీకి ముందు హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడిన సిరాజ్.. రెడ్ బాల్ ఫార్మాట్ మాదిరిగానే బౌలింగ్ చేశానని తెలిపాడు.
‘నేను రంజీ ట్రోఫీలో ఏ లెంగ్త్లో అయితే బౌలింగ్ చేశానో ఇక్కడ కూడా అదే ఫాలో అయ్యాను. పిచ్ బ్యాటింగ్కు కష్టంగా ఉందని అర్థమైంది. దాంతో వికెట్ టు వికెట్ బౌలింగ్ చేశాను’ అని మ్యాచ్ అనంతరం తన సక్సెస్ సీక్రెట్ పంచుకున్నాడు. తనతో పాటు అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్ష్దీప్ సింగ్ను సిరాజ్ అభినందించాడు.
