- 18 రోజుల్లోనే 41 లక్షల మందికి టీకా!
- దేశంలో రికార్డ్ వేగంతో కరోనా వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా సరికొత్త రికార్డును సృష్టించింది. దేశవ్యాప్తంగా 18 రోజుల్లో 41 లక్షల మంది టీకా తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును ఇంత త్వరగా రీచ్ అయిన దేశం మనదేనని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ బుధవారం వెల్లడించింది. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ డ్రైవ్ స్టార్టయింది. డ్రైవ్ వేగంగా కొనసాగుతోందని, బుధవారం నాటికి 41,38,918 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇందులో గత 24 గంటల్లో 1,88,762 మంది హెల్త్ వర్కర్స్కు టీకా వేశామని
వెల్లడించింది.
యాక్టివ్ కేసులు 1.5 శాతమే
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. యాక్టివ్ కేసులు 1.5 శాతం ఉన్నాయని, మరణాలు కూడా తగ్గిపోయాయని హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,039 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 14,225 మంది రికవరీ అయ్యారని వెల్లడించింది. మొత్తంగా 1,04,62,631 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రికవరీ రేట్ 97.08శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 1,60,057 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డెత్ కేసులు నమోదు కాలేదని తెలిపింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే వీక్లీ పాజిటివ్ రేట్ నేషనల్ యావరేజ్ 1.91 కన్నా ఎక్కువగా ఉందని, కేరళలో ఇది 12 శాతం, చత్తీస్గఢ్లో 7 శాతంగా ఉందని పేర్కొంది. 83.01 శాతం కరోనా పాజిటివ్ కేసులు ఆరు రాష్ట్రాలు, యూటీల నుంచే వస్తున్నాయని తెలిపింది. కేరళలో 24 గంటల్లో 5,716, మహారాష్ట్రలో 1,927, తమిళనాడులో 510 కేసులు నమోదయ్యాయని వివరించింది. 24 గంటల్లో 110 మంది చనిపోయారని, ఇందులో ఎక్కువగా మహారాష్ట్రలో 30, కేరళలో 16 ఉన్నారని తెలిపింది. కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగంగా జరగడం మంచి పరిణామమని హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.
For More News..