
పారాసిటమాల్ ఎగుమతిపై గతంలో విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు నిషేధం ఎత్తివేతపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పారాసిటమాల్ తయారీలో ఉపయోగించే ముడిసరుకుల ఎగుమతులపై మాత్రం ఎప్పటిలానే నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపింది.
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తొలుత క్లోరోక్విన్, పారాసిటమాల్ ఔషధాల ఎగుమతిపై నిషేధం విధించింది. అయితే కరోనా వ్యాధిని నయం చేయడానికి ప్రపంచ దేశాల నుంచి ఈ రెండు ఔషధాల కోసం డిమాండ్ పెరగడంతో తాజాగా పారాసిటమాల్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేసింది. కొవిడ్-19 నియంత్రణలో భాగంగా కొన్ని రోజుల క్రితం హైడ్రాక్సీక్లోరోక్విన్ను కూడా భారత్ అమెరికాకు ఎగుమతి చేసింది.