మనీలా (ఫిలిప్పీన్స్): ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్ కోసం సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి జరిగే ఈ టోర్నీలో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. గాయం కారణంగా ప్రణయ్.. టోర్నీ నుంచి తప్పుకోవడంతో సేన్కు పతకం గెలిచే అవకాశాలు మెరుగయ్యాయి. 2020 ఆసియా టీమ్ చాంపియన్షిప్లో బ్రాం జ్ గెలిచిన సేన్.. 2016, 2018 జూనియర్ కేటగిరీలో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ నెగ్గాడు. తొలి రౌండ్లో సేన్.. లీ షీ ఫెంగ్ (చైనా)తో తలపడనున్నాడు. 2016, 2020 టీమ్ చాంపియన్షిప్లో రెండు బ్రాంజ్ మెడల్స్ నెగ్గిన శ్రీకాంత్.. ఇప్పటివరకు వ్యక్తిగత మెడల్ గెలవలేదు. ఎంజ్ జె యంగ్ (మలేసియా) మ్యాచ్తో టోర్నీని ఆరంభించనున్నాడు. జొనాథన్ క్రిస్టీతో సాయి ప్రణీత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక వరల్డ్ చాంపియన్ సింధు.. పతకం రంగు మార్చాలని ప్రయత్నిస్తోంది. 2014లో ఆమె బ్రాంజ్ మెడల్ను సాధించింది. సయ్యద్ మోడీ, స్విస్ ఓపెన్ టైటిల్స్తో సింధు సూపర్ ఫామ్లో ఉంది. ఆరంభ రౌండ్స్లో సింధుకు పెద్దగా ఇబ్బందిలేకపోయినా.. క్వార్టర్స్లో బింగ్ జియావో (చైనా) అడ్డంకిని దాటాల్సి ఉంటుంది. సైనా కూడా నాలుగో మెడల్పై కన్నేసింది. సిమ్ యూజిన్ (కొరియా)తో తొలి మ్యాచ్ ఆడనుంది. డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి, అర్జున్–ధ్రువ్ కపిలపై భారీ అంచనాలు ఉన్నాయి. గాయం కారణంగా విమెన్స్ జోడీ ట్రిసా జోలీ–గాయత్రి గోపీచంద్.. ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నారు.