అండర్-19 లో ఆస్ట్రేలియాపై ఆధిక్యం సాధించిన ఇండియా

అండర్-19 లో ఆస్ట్రేలియాపై ఆధిక్యం సాధించిన ఇండియా

మెక్‌‌కే (ఆస్ట్రేలియా): బౌలింగ్‌‌లో రాణించిన యంగ్‌‌ ఇండియా.. ఆస్ట్రేలియా అండర్‌‌–19తో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్‌‌లో తొలి రోజే ఆధిక్యంలో నిలిచింది. హెనిల్‌‌ పటేల్‌‌ (3/21), ఖిలాన్‌‌ పటేల్‌‌ (3/23) దుమ్మురేపడంతో.. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఆసీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 43.3 ఓవర్లలో 135 రన్స్‌‌కు ఆలౌటైంది. 

అలెక్స్‌‌ లీ యంగ్‌‌ (66) టాప్‌‌ స్కోరర్‌‌. ఇన్నింగ్స్‌‌ మొత్తంలో ఎనిమిది మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. ఉదవ్‌‌ మోహన్‌‌ 2, దీపేశ్‌‌ దేవేంద్రన్‌‌ ఒక్క వికెట్‌‌ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా ఆట ముగిసే టైమ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో 40 ఓవర్లలో 144/7 స్కోరు చేసింది. ప్రస్తుతం 9 రన్స్‌‌ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. 

హెనిల్‌‌ పటేల్‌‌ (22 బ్యాటింగ్‌‌), దీపేశ్‌‌ దేవేంద్రన్‌‌ (6 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ఖిలాన్‌‌ పటేల్‌‌ (26), వైభవ్‌‌ సూర్యవంశీ (20), వేదాంత్‌‌ త్రివేది (25) ఫర్వాలేదనిపించారు. విహాన్‌‌ మల్హోత్రా (11), ఆయుష్‌‌ మాత్రే (4), రాహుల్‌‌ కుమార్‌‌ (9), హర్వంశ్‌‌ పంగాలియా (1) విఫలమయ్యారు. కేసీ బార్టన్ 3, విల్ బైరోమ్ 2 వికెట్లు పడగొట్టారు.