- న్యూజిలాండ్తో ఇండియా ఫస్ట్ టీ20 నేడు
- కొత్త కెప్టెన్.. కొత్త కోచ్తో బరిలోకి టీమిండియా
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
జైపూర్: టీ20 వరల్డ్కప్లో నిరాశపర్చిన టీమిండియా అప్పుడే మరో సవాల్కు రెడీ అయింది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్, కొత్త కుర్రాళ్లతో 2022 టీ20 వరల్డ్కప్ టార్గెట్గా సరికొత్త ప్రయాణం మొదలు పెట్టనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగే ఫస్ట్ టీ20లో బలమైన న్యూజిలాండ్తో తలపడనుంది. టీ20 వరల్డ్కప్ రన్నరప్ కివీస్ జోరుమీదుండగా.. టీ20 ఫార్మాట్ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో టీమిండియా చేయబోయే పెర్ఫామెన్స్పై అందరి దృష్టి నెలకొంది. రోహిత్ గతంలో పలు మార్లు కెప్టెన్గా వ్యవహరించాడు. గత శ్రీలంక టూర్లో ద్రవిడ్ కూడా ఇండియా కోచ్గా పని చేశాడు. కానీ వీరిద్దరూ ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టగా.. తొలి పరీక్షను ఎలా ఎదుర్కొంటారనేది అనేది ఆసక్తికరంగా మారింది. తొలి పోరులోనే గెలిచి సిరీస్పై పట్టు సాధించాలని భావిస్తున్న రోహిత్సేన.. టీ20వరల్డ్కప్లో కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. కోహ్లీ సహా పలువురు సీనియర్ల గైర్హాజరీలో చాన్నాళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడుతున్న ఈ సిరీస్ రిజల్ట్ ఇండియాకు కీలకం.
కేన్ దూరం.. అయినా బలంగానే కివీస్
టీ20 వరల్డ్కప్ రన్నరప్ న్యూజిలాండ్ ఎప్పటిలానే ఆల్రౌండర్లతో అన్ని విభాగాల్లో బలంగా ఉంది. టెస్టు సిరీస్పై ఫోకస్ పెట్టేందుకు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సిరీస్కు దూరంగాఉంటున్నాడు. ఇది కాస్త లోటే అయినా కివీస్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. కేన్ గైర్హాజరుతో పేసర్ టిమ్ సౌథీకి జట్టు పగ్గాలు అప్పజెప్పారు. అయితే, టీ20 వరల్డ్కప్లో బెంచ్కు పరిమితమైన పలువురు ప్లేయర్లను కివీస్ ఈ మ్యాచ్లో బరిలోకి దించనుంది. టాపార్డర్లో ఫుల్ ఫామ్లో ఉన్న గప్టిల్, డారిల్ మిచెల్ కీలకం కానున్నారు. నీషమ్, ఫెర్గూసన్ రూపంలో వరల్డ్ కాస్ల్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు. సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండే చాన్సుంది. అప్పుడు సౌథీకి తోడు కైల్ జెమీసన్ పేస్ బాధ్యతలు తీసుకోనున్నాడు. స్పిన్నర్లు ఇష్ సోధీ, శాంట్నర్ వరల్డ్కప్ ఫామ్ కొనసాగించాలని చూస్తున్నారు.
వెంకటేశ్పై ఫోకస్..
టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీతో పాటు సీనియర్లు బుమ్రా, షమీ, జడేజా ఈ సిరీస్కు దూరంగా ఉండగా.. ఐపీఎల్లో అదరగొట్టిన పలువురు కుర్రాళ్లను సెలక్టర్లు ఈ సిరీస్కు ఎంపిక చేశారు. రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ టీమ్లోకి వచ్చారు. వీళ్లలో రుతురాజ్ ఇప్పటికే శ్రీలంక సిరీస్లో డెబ్యూ చేయగా.. ఫామ్ కోల్పోయి వేటు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా ప్లేస్లో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేయొచ్చు. ప్రాక్టీస్ సెషన్లో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ తనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున అదిరిపోయే పెర్ఫామెన్స్ చేసిన వెంకటేశ్.. పాండ్యాకు తగిన రీప్లేస్మెంట్గా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఫస్ట్ మ్యాచ్లో రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్కు రానున్నారు. అయితే, ఇషాన్ కిషన్, రుతురాజ్లో ఒకరిని ఓపెనర్గా పంపించి ప్రయోగం చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక, ఫామ్ కోల్పోయినప్పటికీ మిడిలార్డర్లో సూర్యకుమార్ కొనసాగడం ఖాయమే. మరో సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు ఫైనల్ ఎలెవన్లో ప్లేస్ కోసం యంగ్స్టర్స్ వెంకటేశ్, రుతరాజ్ నుంచి గట్టి పోటీ ఉంది. ఇక, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అక్షర్ తుది జట్టులోకి రానుండగా వరల్డ్కప్లో రాణించిన అశ్విన్ తన ప్లేస్ను నిలబెట్టుకోనున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు కావాలనుకుంటే లెగ్గీ చహల్ టీమ్లో రీఎంట్రీ ఇస్తాడు. ఐదుగురు పేసర్లు రేసులో ఉన్నా అందరిలో ఎక్కువ అనుభవం ఉన్న భువనేశ్వర్తో సిరాజ్, దీపక్ చహర్లో ఒకరు కొత్త బాల్ పంచుకోవచ్చు. టీ20 వరల్డ్కప్లో ఫెయిలైన భువీ ఈ సిరీస్తో ఫామ్లోకి రాకపోతే అతని కెరీర్కే ప్రమాదం అవుతుంది.
పిచ్/వాతావరణం
మాన్సింగ్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలం. చివరగా 2019 ఐపీఎల్లో ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్లో మంచి స్కోర్లు వచ్చాయి. గ్రౌండ్ పెద్దది కావడం స్పిన్నర్లకు అడ్వాంటేజ్ కానుంది. మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ కీలకం కానుంది.
జట్లు(అంచనా)
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్/ శ్రేయస్/ రుతురాజ్, సూర్యకుమార్, రిషబ్ పంత్ (కీపర్), అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, సిరాజ్, చహల్.
న్యూజిలాండ్: గప్టిల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, చాప్మన్, టిమ్ సీఫర్ట్ (కీపర్), నీషమ్, శాంట్నర్, జెమీసన్, టిమ్ సౌథీ (కెప్టెన్), మిల్నే/ ఫెర్గూసన్, ఇష్ సోధీ.