సింధు జలాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. పాక్కు పెద్ద దెబ్బే ఇది !

సింధు జలాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. పాక్కు పెద్ద దెబ్బే ఇది !

న్యూఢిల్లీ: పాకిస్తాన్కు సింధు నదీ జలాల నిలిపివేతపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. భారత్ నీళ్లు ఇప్పటి వరకు బయటికి వెళ్లాయని, ఇకపై మన దేశ అవసరాల కోసమే నీటిని వినియోగిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇకపై మన దేశంలోని నీళ్లు మనవేనని, మన నీళ్లను మనమే వినియోగించుకుని ప్రగతి పథంలో ముందుకు సాగుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో సింధు నదీ జలాలపై పాకిస్తాన్కు ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక చేశారు.

పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నదని భావిస్తున్న భారత్.. ఆ దేశాన్ని అన్ని వైపులా ఇరుకున పెట్టేందుకు చకచకా అడుగులేస్తున్నది. పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా కఠిన చర్యలకు దిగుతున్నది. ఇప్పటికే చినాబ్​నదిపై ఉన్న  బాగ్‌‌‌‌లిహార్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ నీటిని ఆపేయగా.. తాజాగా ఇదే నదిపై ఉన్న సలాల్‌‌‌‌ డ్యామ్‌‌‌ను కూడా మూసివేసింది. వీటితోపాటు ఈ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన పనులు మొదలుపెట్టినట్టు ఓ జాతీయ​ మీడియా కథనం వెలువరించింది.

గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్‌‌లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్‌ ప్రక్రియను భారత్​మొదలుపెట్టింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌‌‌‌ పవర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌పీసీ) చూసుకుంటున్నది. ఈ పనులు 3 రోజుల పాటు కొనసాగినట్టు తెలుస్తున్నది. 1987, 2009లో ఈ ప్రాజెక్టులను నిర్మించినప్పటి నుంచీ సింధూ జలాల ఒప్పందం ప్రకారం వాటిని ఫ్లషింగ్ చేయలేదు. చెత్తను తొలగించి, ఆ రిజర్వాయర్ల సామర్థ్యం పెంచితే కిందికి నీళ్లు ఓవర్​ఫ్లో అయ్యి పాకిస్తాన్లో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్‌ తీసుకొన్న తొలి చర్య ఇదని నిపుణులు చెబుతున్నారు. 

ఇప్పటికిప్పుడు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యంకాకపోయినా.. భవిష్యత్తులో పాకిస్తాన్​కు తీవ్ర నీటి కొరత ఎదురుకావచ్చని చెబుతున్నారు. సింధూ జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై దాదాపు 6 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్‌‌‌‌నీటికి ఎసరు ఖాయమని అంటున్నారు. ఇక సింధూ జలాల ఒప్పందం నిలిచిపోవడంతో.. పాక్‌‌‌కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్‌‌‌కు లేదు.