
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే ఆయన ప్రభుత్వంలోని అధికారులు కూడా ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. సందు దొరికితే చాలు భారత్పై విషం చిమ్ముతున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగించడానికి ఇండియానే కారణమంటూ ట్రంప్ సలహాదారుడు పీటర్ నవారో భారత్పై అబండాలు మోపుతుండగా.. తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఇండియాపై అవాకులు చెవాకులు పేలాడు.
ప్రస్తుతం కఠిన వైఖరి అవలభిస్తున్నప్పటికీ సుంకాల విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్ చివరికి లొంగిపోతుందని ప్రగల్భాలు పలికారు. భారత్ ఎక్కువ కాలం అమెరికాను ధిక్కరించలేదని.. రెండు నెలల్లోనే ఇండియా అమెరికాకు క్షమాపణ చెబుతుందని పగటి కలలు కన్నారు. న్యూఢిల్లీ తన వైఖరి మార్చుకోకపోతే ఆ దేశ ఎగుమతులపై మరిన్ని సుంకాలను విధించాల్సి రావచ్చని హెచ్చరించారు.
►ALSO READ | డౌటే లేదు.. రష్యా నుంచి ఆయిల్ బరాబర్ కొంటాం : అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇండియా
గతంలో కెనడా అమెరికాతో సుంకాల వివాదానికి కాలు దువ్వడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నదని గుర్తు చేసి పరోక్షంగా భారత్ను బయపెట్టాలని చూశారు లుట్నిక్. ఇండియావన్నీ కేవలం ధైర్యసాహసాలేనని.. చివరకు వాళ్లే తమ తప్పు అర్ధం చేసుకుని అమెరికాతో ఒప్పందం కోసం ముందుకు వస్తారని అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. నెల లేదా రెండు నెలల్లో తప్పు అయింది క్షమించడని ప్రాధేయపడి ట్రంప్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుందని అహంకారపూరిత మాటలు మాట్లాడారు లుట్నిక్.
ఇండియా తమ తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు ప్రధాని మోడీతో ఎలా వ్యవహరించాలో ట్రంపే నిర్ణయం తీసుకుంటారని.. ఆ నిర్ణయాన్ని పూర్తిగా ఆయనకే వదిలేస్తామని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపడంతో పాటు బ్రిక్స్లో భాగం కావడం మానేస్తే ఇండియా అమెరికా సుంకాల నుంచి తప్పించుకోవచ్చు. లేదు రష్యా, చైనా మధ్య వారధిగా ఉండాలనుకుంటే 50 శాతం సుంకాలు చెల్లించండని అన్నారు.