
దుబాయ్: బ్యాటింగ్లో దుమ్మురేపుతూ పాకిస్తాన్ను రెండోసారి పడగొట్టిన టీమిండియా ఆసియా కప్లో ఫైనల్ బెర్తుపై గురి పెట్టింది. దాయాదిని చిత్తు చేసిన జోరును కొనసాగిస్తూ బుధవారం జరిగే సూపర్–4 మ్యాచ్లో బంగ్లాదేశ్ పని పట్టేందుకు రెడీ అయింది. ఈ మ్యాచ్లో గెలిచి తుదిపోరుకు చేరుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. గత పోరులో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లా టైగర్స్.. మరో అద్భుతాన్ని ఆశిస్తున్నారు.
కానీ, గణాంకాల పరంగా చూస్తే ఈ మ్యాచ్ ఏకపక్షంగానే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ ఒకే ఒక్కసారి గెలిచింది. కానీ, 2015 వరల్డ్ కప్ తర్వాత ఇరు జట్ల మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. దీంతో మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతానికి ఈ టోర్నీలో సూర్యకుమార్ సేన తర్వాత సెకండ్ బెస్ట్ టీమ్గా బంగ్లానే కనిపిస్తోంది. ఆ టీమ్ స్పిన్నర్లతో ఇండియాకు కాస్త పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
బ్యాటింగే బలంగా..
ఇండియా బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ అద్భుత ఫామ్లో ఉంది. యువరాజ్ శిష్యుడు అభిషేక్ శర్మ దాదాపు 210 స్ట్రయిక్ రేట్తో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగుతూ పవర్ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మరోవైపు, అతని దోస్తు గిల్ తన క్లాస్ టచ్తో పాకిస్తాన్పై దాదాపు 158 స్ట్రైక్ రేట్తో రన్స్ సాధించి ఫామ్లోకి వచ్చాడు. నీరు–నిప్పులా చెలరేగుతున్న ఈ జోడీ ఇండియాకు బలమైన పునాది వేస్తోంది. గత మ్యాచ్లో డకౌటైనా.. సూర్య మరోసారి జట్టును ముందుండి నడిపించాలని చూస్తున్నాడు. అయితే, మిడిలార్డర్లో మన జట్టుకు చిన్న సమస్య ఉంది. ఈ ఏడాది తిలక్ వర్మ స్పిన్ బౌలింగ్లో తడబడుతున్నాడు.
2024లో స్పిన్నర్లపై 190 ప్లస్ స్ట్రయిక్ రేట్తో రన్స్ చేసిన తిలక్, 2025లో మాత్రం 15 స్ట్రయిక్ రేట్తో ఇబ్బంది పడుతున్నాడు. అతని డాట్ బాల్ శాతం 38కి పెరిగింది. 4, 5వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్న తిలక్, శాంసన్ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కోవడం జట్టుకు కీలకం కానుంది. గత పోరులో శివం దూబే, పాండ్యా మినహా ఇండియా బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గ్రూప్ దశలో విజృంభించిన మాదిరిగా బౌలర్లంతా సమష్టిగా రాణిస్తే ఇండియాకు తిరుగుండదు.
బౌలింగ్ పైనే బంగ్లా భారం
ఇండియా బ్యాటింగ్లో దుర్బేధ్యంగా ఉంటే అందుకు విరుద్ధంగా బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడుతున్నారు. కెప్టెన్ లిటన్ దాస్ , తౌహిద్ హృదయ్లో టీ20కి అవసరమైన స్ట్రయిక్ రేట్ లోపించింది. ఇండియా బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోరు సాధించే పవర్ గేమ్ వారి బ్యాటింగ్లో కొరవడింది. ఈ మ్యాచ్లో గెలిచేందుకు బంగ్లాకు ఉన్న బెస్ట్ ఆప్షన్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవడం. డెత్ ఓవర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మిడిల్ ఓవర్లలో లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్, ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ సత్తా చాటి ఇండియాను 150–-160 స్కోరుకే కట్టడి చేయగలిగితే టార్గెట్ ఛేజ్ చేసే అవకాశం ఉంటుంది.
కానీ, అంత ఈజీ కాదని బంగ్లాకు తెలుసు. ఏదేమైనా స్పిన్నర్లతో పాటు స్లో పిచ్లపై సత్తా చాటుతున్న పేసర్ ముస్తాఫిజుర్పై బంగ్లా భారీ అంచనాలు పెట్టుకుంది. శ్రీలంకతో గత మ్యాచ్లో ముస్తాఫిజుర్ 4 ఓవర్లలో 20 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్న అతను ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టే చాన్సుంది. ఇక శ్రీలంకపై భారీగా రన్స్ ఇచ్చిన షొరిఫుల్ ఇస్లాం స్థానంలో బంగ్లా తంజిమ్ హసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
పిచ్/వాతావరణం
దుబాయ్లో పిచ్లు స్లోగా ఉండటంతో మిడిల్ ఓవర్లలో వేగంగా రన్స్ చేయడం కష్టంగా మారింది. టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్కే మొగ్గు చూపొచ్చు. రాత్రిపూట విపరీతమైన వేడి ఆటగాళ్లకు మరో సవాల్ కానుంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, తంజీద్ హసన్, లిటన్ దాస్ (కెప్టెన్, కీపర్), తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, జాకర్ అలీ, మెహిదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.