ఆనందం ఏడింతలు..పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ

ఆనందం ఏడింతలు..పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ
  • వరల్డ్​ కప్​లో పాక్​పై ఇండియా గ్రాండ్​ విక్టరీ
  • డక్వర్త్ లూయిస్ ప్రకారం 89 రన్స్ తేడాతో గెలుపు
  • రోహిత్ సూపర్ సెంచరీ.. రాణించిన కోహ్లీ, కుల్దీప్, హార్దిక్

జై  ఇండియా. వరల్డ్‌‌కప్‌‌లో పాకిస్థాన్‌‌తో మ్యాచ్‌‌ అనగానే ఎక్కడా లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని.. కసిగా చెలరేగే టీమిండియా మరోసారి గర్జించింది. రోహిత్‌‌ శర్మ  (113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140) సూపర్‌‌ సెంచరీకి తోడు కుల్దీప్‌‌ యాదవ్‌‌ (2/32), విజయ్‌‌ శంకర్‌‌ (2/22), హార్దిక్‌‌ పాండ్యా (2/44) బంతితో మాయ చేయడంతో  ఆదివారం  వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 89  పరుగుల తేడాతో (డక్‌‌వర్త్‌‌ లూయిస్‌‌ పద్ధతిలో)  గ్రాండ్‌‌ విక్టరీ కొట్టింది. తొలుత ఇండియా 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 336 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్‌‌తో పాటు విరాట్‌‌ కోహ్లీ (77), లోకేశ్‌‌ రాహుల్‌‌ (57) హాఫ్‌‌ సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం ఛేజింగ్‌‌లో  పాకిస్థాన్‌‌ 35 ఓవర్లలో 166/6తో నిలిచిన దశలో వర్షంతో ఆట ఆగింది. గంట తర్వాత ఆట మళ్లీ మొదలవగా డక్‌‌వర్త్‌‌ పద్ధతిలో పాక్‌‌ టార్గెట్‌‌ను 40 ఓవర్లలో 302  రన్స్‌‌గా సవరించారు. కానీ,  ఆరు వికెట్లకు 212 పరుగులే  చేసిన  సర్ఫరాజ్‌‌సేన భారీ ఓటమి మూటగట్టుకుంది. ఫఖర్‌‌ జమాన్‌‌ (62), బాబర్‌‌ ఆజమ్‌‌ (48), ఇమాద్‌‌ వసీం (46 నాటౌట్‌‌) మినహా పాక్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ చెతులెత్తేశారు. రోహిత్‌‌ మ్యాన్‌‌ ఆఫ్‌‌ ది మ్యాచ్‌‌గా నిలిచాడు.

పోరాటం కాసేపే..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఆరంభంలోనే  పాక్​కు షాక్‌‌ తగిలింది. వరల్డ్‌‌కప్‌‌ అరంగేట్రం మ్యాచ్‌‌లో తన ఫస్ట్‌‌ బాల్‌‌కే ఓపెనర్‌‌ ఇమాముల్‌‌ (7)ను ఔట్‌‌ చేసిన విజయ్‌‌ శంకర్‌‌ ఇండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఐదో ఓవర్లో నాలుగో బాల్‌‌ వేసిన తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో పేసర్‌‌ భువనేశ్వర్‌‌ మైదానం వీడాడు. ఆ ఓవర్‌‌ పూర్తి చేసేందుకు బౌలింగ్‌‌కు వచ్చిన శంకర్‌‌ వేసిన స్ట్రెయిట్‌‌ బాల్‌‌కు ఇమాముల్‌‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. కానీ, ప్రధాన పేసర్‌‌ సేవలు కోల్పోవడంతో ఇండియా పేస్‌‌ పదును తగ్గింది. మరో ఓపెనర్‌‌ ఫఖర్‌‌ జమాన్‌‌, బాబర్‌‌ ఆజమ్‌‌ నెమ్మదిగా క్రీజులో పాతుకుపోయారు. దాంతో, 15 ఓవర్లకు పాక్‌‌ 64 రన్స్‌‌ మాత్రమే వచ్చినా..  తర్వాత ఇద్దరూ గేరు మార్చి ఎదురుదాడికి దిగారు. పాండ్యా వేసిన 16వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ఫఖర్‌‌ జమాన్‌‌ జోరు పెంచాడు. చహల్‌‌ బౌలింగ్‌‌లో జమాన్‌‌తో పాటు బాబర్‌‌ చెరో సిక్సర్‌‌ కొట్టడంతో పాక్‌‌ శిబిరం హోరెత్తిపోయింది. ఇండియా ఫ్యాన్స్‌‌లో గుబులు మొదలైంది. ఈ సమయంలో  ఇండియాకు ఓ వికెట్‌‌ అనివార్యమైంది. ఒకటేం కర్మ అన్నట్టుగా.. చైనామెన్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌, హార్దిక్‌‌ పాండ్యా నాలుగు ఓవర్ల వ్యవధిలో4 వికెట్లు తీసి మ్యాచ్‌‌ను వన్‌‌సైడ్‌‌ చేసేశారు. కుల్దీప్‌‌ మూడు బంతుల తేడాతో బాబర్‌‌, జమాన్‌‌ను ఔట్‌‌ చేసి పాక్‌‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 24వ ఓవర్లో  అద్భుతమైన టర్నింగ్‌‌ బాల్‌‌తో బాబర్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు. ఆపై, 26వ ఓవర్‌‌ రెండో బాల్‌‌ను స్లీప్‌‌ చేయబోయిన జమాన్‌‌.. షార్ట్‌‌ఫైన్‌‌ లెగ్‌‌లో చహల్‌‌కు చిక్కాడు. తర్వాతి ఓవర్లో చివరి రెండు బంతుల్లో సీనియర్‌‌ ప్లేయర్లు మహ్మద్‌‌ హఫీజ్‌‌ (9), షోయబ్‌‌ మాలిక్‌‌ (0)ను  పెవిలియన్‌‌ చేర్చిన హార్దిక్‌‌  ఇండియా ఆనందాన్ని నాలుగింతలు చేశాడు. దాంతో, 23 ఓవర్లకు 113/1తో రేసులో ఉన్న పాక్‌‌ 27 ఓవర్లకు 129/5తో ఓటమి వైపు పయనించింది. ఈ దశలో ఇమాద్‌‌ వసీమ్‌‌ (22 నాటౌట్‌‌), కెప్టెన్‌‌ సర్ఫరాజ్‌‌ అహ్మద్‌‌ (12) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు. కానీ, 35వ ఓవర్లో సర్ఫరాజ్‌‌ను బౌల్డ్‌‌ చేయడంతో పాక్‌‌ పరాజయం ఖాయమైంది.

ఓపెనర్లు సూపర్‌‌..

ఇండియా ఇన్నింగ్స్‌‌లో హీరో రోహితే. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లోనే సెంచరీతో ఫామ్‌‌లోకి వచ్చిన హిట్‌‌మ్యాన్‌‌ చిరకాల ప్రత్యర్థిపై పంజా విసిరాడు. ముచ్చటైన కట్‌‌ షాట్లు.. ట్రేడ్‌‌మార్క్‌‌ స్లాగ్‌‌స్వీప్‌‌ షాట్లతో స్వేచ్ఛగా బౌండ్రీలు రాబడుతూ అద్భుత సెంచరీ కొట్టిన అతను జట్టుకు భారీస్కోరు అందించాడు. ధవన్‌‌ లేని లోటు కనిపించకుండా మొదట లోకేశ్‌‌ రాహుల్‌‌, తర్వాత విరాట్‌‌ కోహ్లీ అతనికి అండగా నిలిచారు. తొలుత లోకేశ్‌‌ రాహుల్‌‌ క్రీజులో కుదురుకునేదాకా డెడ్‌‌ డిఫెన్స్‌‌తో పాక్‌‌ పేసర్ల సహనం పరీక్షించాడు. రోహిత్‌‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌‌ చేసినా.. గత అనుభవాల దృష్ట్యా ఆమిర్‌‌ (3/47)బౌలింగ్‌‌లో మాత్రం రిస్క్‌‌ తీసుకోలేదు. మరో ఎండ్‌‌లో హసన్‌‌ అలీ (1/84)పై ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. పదో ఓవర్లో రనౌటయ్యే ప్రమాదం తప్పించుకున్న శర్మ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు.  షాదాబ్‌‌ వేసిన 12వ ఓవర్లో 4,6 కొట్టిన హిట్‌‌మ్యాన్‌‌.. అతని బౌలింగ్‌‌లోనే మరో బౌండ్రీతో 34 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ మార్కు దాటాడు. రాహుల్‌‌ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా బౌండ్రీలు రాబట్టడంతో 18వ ఓవర్లోనే స్కోరు వంద దాటింది. షోయబ్‌‌ మాలిక్‌‌ వేసిన 22వ ఓవర్లో పుల్‌‌షాట్‌‌తో సిక్సర్‌‌ బాది ఫిఫ్టీ మార్కు దాటిన లోకేశ్‌‌.. ఆపై హఫీజ్‌‌ బౌలింగ్‌‌లో మరో  సిక్సర్‌‌ బాదాడు. కానీ, రియాజ్‌‌  అతడిని ఔట్​ చేయడంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 136 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌కు బ్రేక్‌‌ పడింది.

కోహ్లీ అండతో రోహిట్టు

రాహుల్‌‌ ఔటయ్యే టైమ్‌‌కు 65 బాల్స్‌‌లో 75 రన్స్‌‌తో ఉన్న రోహిత్‌‌ వన్‌‌డౌన్‌‌లో వచ్చిన కెప్టెన్‌‌ కోహ్లీతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. హసన్‌‌ అలీ బౌలింగ్‌‌లో ఓ ఫోర్‌‌, సిక్సర్‌‌ బాదిన అతను 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు తొలి 17 బాల్స్‌‌లో 9 రన్స్‌‌ మాత్రమే చేసిన కోహ్లీ.. ఆమిర్‌‌ బౌలింగ్‌‌లో తన ట్రేడ్‌‌మార్క్‌‌ కవర్‌‌ డ్రైవ్‌‌తో ఫోర్‌‌ కొట్టి జోరు పెంచాడు.  సెంచరీ తర్వాత రోహిత్‌‌ టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చేశాడు. క్లాసిక్‌‌ షాట్లతో వరుసగా బౌండ్రీలు బాదేయడంతో 35వ ఓవర్లో టీమ్‌‌ స్కోరు 200 దాటింది. డబుల్‌‌ చేసేలా కనిపించిన అతను హసన్‌‌ అలీ వేసిన 39వ ఓవర్లో షార్ట్‌‌ఫైన్‌‌ లెగ్‌‌లో రియాజ్‌‌కు క్యాచ్​ ఇచ్చాడు.   నాలుగో నంబర్‌‌లో వచ్చిన  హార్దిక్‌‌ పాండ్యా (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌‌తో 26)  ధాటిగానే ఆడినా ఆమిర్‌‌ బౌలింగ్‌‌లో హెలికాప్టర్‌‌ షాట్‌‌ ఆడే ప్రయత్నంలో లాంగాన్‌‌లో బాబర్‌‌ ఆజమ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే ధోనీ (1)ని ఔట్‌‌ చేసిన ఆమిర్‌‌ ఇండియా స్పీడుకు బ్రేకులు వేశాడు. కానీ, ధాటిగా ఆడిన కోహ్లీ  హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. 46 ఓవర్లలోనే స్కోరు 300 దాటింది.  46.4 ఓవర్లకు జట్టు 305/4తో ఉన్న టైమ్‌‌లో వర్షం కారణంగా దాదాపు 50 నిమిషాలు ఆట ఆగింది. మళ్లీ మొదలైన తర్వాత ఆమిర్‌‌ వేసిన 48వ ఓవర్లో కోహ్లీ ఔటవగా.. విజయ్‌‌ శంకర్‌‌ (15 నాటౌట్‌‌), కేదార్‌‌ (9 నాటౌట్‌‌) షాట్లు ఆడలేకపోయారు.

లక్కీ రోహిత్​..

32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్​ రనౌట్​మిస్​ చేసి పాక్​ పెద్ద మూల్యం చెల్లించుకుంది. 10వ ఓవర్​లో రియాజ్ తొలి బంతిని రాహుల్ ఆన్​సైడ్​కు పంపి సింగిల్​కోసం పరుగెత్తాడు. రోహిత్​ కూడా ఫస్ట్​ రన్​ పూర్తి చేసి.. రాహుల్​ను పట్టించుకోకుండా రెండో దానికి కోసం సగం పిచ్​వరకు వచ్చాడు.  కానీ రెండో రన్​ కోసం ఆసక్తి చూపని రాహుల్​పెద్దగా స్పందించలేదు. రెండు అడుగులు అలా ముందుకు వచ్చినట్లే వచ్చి ఆగిపోయాడు. అయితే మిడ్​ వికెట్​లో  ఫీల్డింగ్​ చేస్తున్న ఫఖర్​ జమాన్​.. బంతిని కీపర్​కు కాకుండా నాన్​ స్ర్టయిక్​వైపు విసిరాడు.  అప్రమత్తమైన రోహిత్​ వెంటనే క్రీజులోకి వచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ బంతి సర్ఫరాజ్​చేతికి అందిస్తే రోహిత్​ కచ్చితంగా రనౌట్​ అయ్యేవాడు. తర్వాతి ఓవర్​లోనూ ఇదే సీన్​ రిపీట్​ అయ్యింది.  ఇమాద్​ వసీమ్​ బంతిని ఆఫ్​సైడ్​ ఆడిన రాహుల్​ రన్​ కోసం పరుగెత్తాడు. కానీ రోహిత్​ ఆలస్యంగా స్పందించాడు. కనీసం ఫ్రేమ్​లో కూడా లేడు. షాదాబ్​ సింగిల్​ హ్యాండ్​తో బంతిని అద్భుతంగా అందుకున్నా.. రాంగ్​ డైరెక్షన్​లో త్రో విసిరాడు. డైరెక్ట్​త్రో అయితే రోహిత్​ ఔటయ్యేవాడు.

స్కోర్‌‌బోర్డ్‌‌

ఇండియా: రాహుల్‌‌ (సి) బాబర్‌‌ (బి) రియాజ్‌‌ 57, రోహిత్‌‌ (సి) రియాజ్‌‌ (బి) హసన్‌‌ అలీ 140, కోహ్లీ (సి) సర్ఫరాజ్‌‌ (బి) ఆమిర్‌‌ 77, హార్దిక్‌‌ (సి) బాబర్‌‌ (బి) ఆమిర్‌‌ 26, ధోనీ (సి) సర్ఫరాజ్‌‌ (బి) ఆమిర్‌‌ 1, శంకర్‌‌ (నాటౌట్) 15, కేదార్‌‌ (నాటౌట్) 9; ఎక్స్‌‌ట్రాలు: 11; మొత్తం: 50 ఓవర్లలో 336/5; వికెట్ల పతనం: 1–136, 2–234, 3–285, 4–298, 5–314; బౌలింగ్‌‌: ఆమిర్‌‌ 10–1–47–3, హసన్‌‌ 9–0–84–1, రియాజ్‌‌ 10–0–71–1, ఇమాద్‌‌ 10–0–49–0, షాదాబ్‌‌ 9–0–61–0, మాలిక్‌‌ 1–0–11–0, హఫీజ్‌‌ 1–0–11–0.

పాకిస్థాన్‌‌: ఇమాముల్‌‌ (ఎల్బీ) శంకర్‌‌ 7, ఫఖర్‌‌ జమాన్‌‌ (సి) చహల్‌‌ (బి) కుల్దీప్‌‌ 62, బాబర్‌‌ (సి) కుల్దీప్‌‌ 48, హఫీజ్‌‌ (సి) శంకర్‌‌ (బి) పాండ్యా 9, సర్ఫరాజ్‌‌ (బి) శంకర్‌‌ 12,మాలిక్‌‌ (బి) పాండ్యా 0, ఇమాద్‌‌ వసీం (నాటౌట్‌‌)46, షాదాబ్‌‌ (నాటౌట్‌‌)20, ఎక్స్‌‌ట్రాలు:8, వికెట్ల పతనం: 1–13, 2–117, 3–126, 4–129, 5–129, –6-– 165. బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 2.4–0–8–0, బుమ్రా 8–0–52–0, శంకర్‌‌ 5.2–0–22–2, హార్దిక్‌‌ 8–0–44–2, కుల్దీప్‌‌ 9–1–32–2, చహల్‌‌ 7–0–53–0.