
- మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరణ
- కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ అంచనా
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని కేంద్రం అంచనా వేసింది. నిరంతర సంస్కరణల వల్ల 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుందని తెలిపింది. పది సంవత్సరాల క్రితం, భారతదేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అప్పుడు భారత జీడీపీ విలువ 1.9 ట్రిలియన్ డాలర్లు ఉంది.
కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా ప్రస్తుతం 3.7 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రస్తుతం ఇండియా ఐదో పెద్ద ఎకానమీగా ఎదిగిందని మంత్రిత్వ శాఖ ‘ఆర్థిక వ్యవస్థపై జనవరి 2024 సమీక్ష’లో తెలిపింది. ప్రభుత్వం 2047 నాటికి 'అభివృద్ధి చెందిన దేశం'గా మారాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సంస్కరణలు కొనసాగుతుండటంతో ఈ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి భాగస్వామ్యంతో సంస్కరణలు మరింత ప్రయోజనకరంగా, ఫలవంతంగా ఉంటాయని స్పష్టం చేసింది.
దేశీయ డిమాండ్ వల్ల గత మూడేళ్లలో ఆర్థిక వ్యవస్థను 7శాతం వృద్ధి రేటు సాధించింది. 2025 ఆర్థిక సంవత్సరం వాస్తవ జీడీపీ వృద్ధి 7 శాతానికి దగ్గరగా ఉంటుందని సమీక్ష నివేదిక పేర్కొంది. 2030 నాటికి వృద్ధి రేటు 7 శాతానికి పైగా పెరగడానికి అవకాశం ఉందని తెలిపింది. సంస్కరణల బలంతో రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందడం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.