
శృతి రామచంద్రన్ (Shruti Ramachandran).. చూడ్డానికి ఎంతో నేచురల్గా, పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. ఆమె ఎంచుకునే పాత్రలు, కథలు.. ఎక్కువకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసినా అలాగే కొనసాగాలనే ఆంక్షలేం పెట్టుకోకుండా నచ్చిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తుంటుంది. శృతి నటిస్తుందంటే ఆ పాత్ర కాస్త ప్రత్యేకంగా ఉంటుందనేలా చేసింది ఆమె. మల్టీ టాలెంటెడ్ అయిన శృతి తన టాలెంట్స్ని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తుంటుంది.
తమిళనాడులోని చెన్నైలో పుట్టింది శృతి రామచంద్రన్. తర్వాత వాళ్ల ఫ్యామిలీ అంతా కొచ్చికి షిఫ్ట్ అయింది. అందువల్ల ఆమె చెన్నై, కొచ్చిలలో స్కూల్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ చదివింది. సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కోర్ట్ రూమ్ డ్రామాలో శ్రుతి రామచంద్రన్ కీలక పాత్రలో నటించింది. ఇటీవలే ఈ సినిమాతో ఆడియెన్స్ను పలకరించింది. మరి ఆమె జర్నీ విశేషాలేంటో శృతి మాటల్లోనే...
‘‘నా మొదటి సినిమా మలయాళం ‘న్యాన్’.అందులో దుల్కర్ సల్మాన్తో కలిసి నటించా. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే.. ఒకసారి రోజూలానే నేను డాన్స్ నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్లా. నా డాన్స్ చూసిన డైరెక్టర్ రంజిత్ సినిమాలో నటించమని నన్ను అడిగాడు. నేను చేయలేను అనుకుంటూనే సెట్కి వెళ్లా.
ఎందుకంటే సినిమా తీయడం అనేది పెద్ద గొప్పేం కాదని అప్పట్లో నా ఫీలింగ్ . దాంతో నాకు వచ్చిన అవకాశానికి తగిన కృతజ్ఞత కూడా చూపించలేకపోయా. ప్రతి ఒక్కరికీ ఇలా ఈజీగా చాన్స్ రావడం అసంభవం. ఒక డాన్స్ క్లాస్కి వెళ్తే వెంటనే సినిమాలో అవకాశం రావడం అనేది ఎవరూ ఊహించరు కూడా. అలాంటి సంఘటన నాకు జరగడంతో సినిమాలో చాన్స్ ఈజీగానే వస్తుందనే భావనతో ఉండేదాన్ని. ఆ తర్వాతే అర్థమైంది ఇది ఎంత పెద్ద అవకాశమో!
పెండ్లి అయ్యాక ‘ప్రేతమ్’లో..
మొదటి సినిమా తర్వాత నేను ఆర్కిటెక్చర్లో మాస్టర్స్ పూర్తి చేశాను. ముంబైలోని ఒక కాలేజీలో టీచింగ్ జాబ్ చేశాను. పెండ్లి అయ్యాక కూడా ముంబై వెళ్లాలనుకున్నా. అప్పుడే ‘ప్రేతమ్’లో ఆఫర్ వచ్చింది. ఈ ఆపర్చ్యునిటీ కూడా అనుకోకుండానే వచ్చింది. ఈ సినిమాలో లీడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ అయిన జయసూర్య నన్ను జిమ్లో చూసి ‘గోస్ట్లా నటించగలవా?’ అని అడిగారు.
మొదట్లో నేను ‘నో’చెప్పాలనే అనుకున్నా. ఎందుకంటే నేను ఆ పాత్రను ఎంజాయ్ చేయలేను అనిపించింది. అప్పుడు ఫిల్మ్ డైరెక్టర్ రంజిత్ నాకు మళ్లీ ఫోన్ చేశారు. కొత్తవాళ్లతో ఆయన చాలా బాగా మాట్లాడతారు. అలా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ కూడా. అలా ఆయనతో డిస్కస్ చేశాక, ఈ సినిమాలో నటించాను. ఇంకా చెప్పాలంటే.. సినిమాలపై అప్పటివరకు ఉన్న నా ఆలోచనను మార్చేసిన ప్రాజెక్ట్ అది.
కెరీర్ కన్ఫ్యూజన్:
కెరీర్ గురించి ఒక నిర్ణయానికి రావడం అంత ఈజీ కాదు. ఆ టైంలో నేను రెండు రకాల ఆలోచనలతో ఉన్నా. ఆర్కిటెక్చర్ చేయాలా? లేక చేతిలో సినిమాలు ఉన్నాయి.. ఇదే కంటిన్యూ చేయాలా? అని. ఆ సమయంలో మా హస్బెండ్ ఫ్రాన్సిస్ థామస్ నేను సరైన నిర్ణయం తీసుకోవడానికి సాధనంగా పనిచేశారు. ఒక ఏడాదిపాటు కొచ్చి వెళ్లాలనుకున్నారాయన. అది ఇప్పుడు ఐదేండ్లు అయింది.
ఎన్నో ఏండ్ల బంధం మాది:
నాకు చదవడం అంటే బాగా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఫ్రాన్సిస్ రచనలకు నేను ఫ్యాన్ని. అతను అడ్వర్టైజింగ్లో కాపీరైటర్గా పనిచేశారు. మేం14 ఏండ్లుగా కలిసి పెరిగాం. అతని రచనలు, తను ఎదిగిన విధానమంతా నేను కళ్లారా చూశాను. ఫ్రాన్సిస్ రాసిన ఒక ‘అన్వేషణమ్’అనే మలయాళ డ్రామాలో నేనూ నటించా. ఆ ప్రాజెక్ట్ తర్వాత తనకి పెద్ద డైరెక్టర్స్ నుంచి అవకాశాలు వచ్చాయి.
‘మధురం’ ఇచ్చిన మెమొరీస్:
నేను ఇండస్ట్రీకి వచ్చిన ఐదేండ్ల తర్వాత ‘మధురం’లాంటి మంచి ఎక్స్పీరియెన్స్ దక్కింది. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ‘మధురం’ఎప్పుడు రిలీజ్ అవుతుందో చివరివరకు నాకు తెలియదు. ఓటీటీలో రిలీజ్ అయిందని తెలియగానే నిజమా? కలా? అన్నట్లు ఉండిపోయా.
ఓటీటీ ప్లాట్ఫాం నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ‘మధురం’ సినిమా టైంలో చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇది నా పదో సినిమా. ఆడియెన్స్ ఎక్కువగా మాట్లాడుకున్న పాత్ర కూడా ఇదే. వాళ్ల ప్రశంసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటివరకు నా కెరీర్లోనే అలాంటి అప్రిసియేషన్ అందుకోలేదు.
నిజానికి ఆ మూవీ డైరెక్టర్ అహ్మద్ కబీర్తో కలిసి వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఆశ ఉండేది. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా బిర్యానీ గురించే మాట్లాడుకోవాలి.
అప్పట్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు బిర్యానీ ఇష్టంగా తినేదాన్ని. కానీ, ఈ సినిమా కారణంగా పది రోజులు ఒక హోటల్లో షూటింగ్ చేసినప్పుడు రోజూ బిర్యానీ తినాల్సి వచ్చింది. ఎంత బిర్యానీ తిన్నానో కూడా గుర్తులేదు. రోజూ ఉదయం 7:30 గంటలకు బిర్యానీ తినడంతో షూటింగ్ మొదలవుతుంది. మొదటి రెండు రోజులూ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. కానీ, మూడోరోజుకే విసుగొచ్చేసింది.
రోజూ తినడం వల్ల నా బాడీ కూడా అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. కష్టంగా అనిపించింది కానీ, దాని గురించి కంప్లయింట్ చేయలేదు. అయితే ఈ క్రమంలో రీటేక్స్ కూడా చాలా అయ్యేవి. ఉదయం బిర్యానీ తినడం వల్ల మధ్యాహ్నం ఆకలి వేసేది కాదు. ఏదేమయినా నిజానికి అవన్నీ నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఒక్క సారి స్క్రిప్ట్ విని ఓకే చేసిన సినిమా కూడా ఇదే.
నా విజన్ నాకుంటుంది:
నేను కథ వినేటప్పుడు ఒక రైటర్ ఆలోచన నుంచి వచ్చిన పాత్రగానే చూస్తాను. కానీ, చాలాసార్లు మీ లైఫ్లో ఏది జరిగినా అవి మిగతా అంశాల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. దానివల్ల మా యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు.. నేను ఏదైనా పాత్రలో నటించేటప్పుడు ఆ క్యారెక్టర్ వెనక కథలన్నింటిపై వర్క్ చేస్తాం. అలాగే నేను రాస్తున్నప్పుడు యాక్ట్ చేస్తుంటాను. నాక్కూడా స్క్రిప్ట్ విషయంలో ఒక విజన్ ఉంటుంది. ఆ రకంగా అర్థం చేసుకుంటా.
డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవార్డు!
‘కమల’ సినిమాలో టైటిల్ రోల్కు డబ్బింగ్ చెప్పడానికి వెతుకుతున్నప్పుడు నేను రంజిత్తో నా రెండో సినిమా ప్రేతమ్ చేస్తున్నాను. అప్పుడు తను నన్ను ఈ పాత్రకు డబ్బింగ్ చెప్తావా అని అడిగారు. నేను సరే చెప్తాను అన్నాను. టీంతో నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను కాబట్టి నాకు ఇదొక టాస్క్లా మాత్రమే అనిపించింది.
కమల పాత్రకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ నేను డబ్బింగ్లో చూపించాలి. ఆ పాత్రలో నటించిన రుహానీ చాలా బాగా చేసింది. డబ్బింగ్ చెప్పాలంటే నేను కొంత ఒత్తిడికి గురయ్యా. కానీ, అవార్డ్ వస్తుందని మాత్రం అనుకోలేదు. నిజానికి వేరొక యాక్టర్కి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. ఈ సినిమా తర్వాత నేను‘అన్వేషణమ్’కి డబ్బింగ్ చెప్పా.
తెలుగు, తమిళంలో వెబ్ సిరీస్ల్లోనూ నటించా. తెలుగులో నటించేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. నా పర్ఫార్మెన్స్కి భాష అడ్డంకి కాకూడదని దాన్ని అధిగమించడానికి ప్రయత్నించా. వేరే భాషలో నటించాలనుకుంటే ముందు ఆ భాష నేర్చుకోవడం ఉత్తమమైన పని. సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కోర్ట్ రూమ్ డ్రామాలో శ్రుతి రామచంద్రన్ కీలక పాత్రలో నటించింది.