
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్, ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి విజయవంతంగా చేరుకున్నారు. యాక్సియం–4 మిషన్లో భాగంగా బుధవారం స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరిన శుక్లా, మరో ముగ్గురు ఆస్ట్రోనాట్ లతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 28 గంటల స్పేస్ జర్నీ తర్వాత గురువారం సాయంత్రం 4 గంటలకు ఐఎస్ఎస్ కు సక్సెస్ ఫుల్గా అనుసంధానం (డాకింగ్) అయింది. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ నుంచి నలుగురు ఆస్ట్రోనాట్ లు ఒక్కొక్కరుగా ఐఎస్ఎస్ లోకి ఎంటరయ్యారు.
దీంతో ఐఎస్ఎస్ కు వెళ్లిన తొలి భారత ఆస్ట్రోనాట్ గా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ముందుగా మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, ఆ తర్వాత శుక్లా, అనంతరం మిగిలిన ఇద్దరు ఐఎస్ఎస్ లోకి వెళ్లారు. వీరికి ఐఎస్ఎస్ లోని ఆస్ట్రోనాట్ లు సాదరంగా స్వాగతం పలికారు. ఐఎస్ఎస్ తో డ్రాగన్ క్యాప్సూల్ డాకింగ్ కావడం, ఆస్ట్రోనాట్ లు ఐఎస్ఎస్ లోకి ప్రవేశించడానికి సంబంధించిన వీడియోను యాక్సియం 4 మిషన్ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
కాగా, బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం–4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లాతో సహా పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ -విస్నీవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) దిగువ భూ కక్ష్యలో తిరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు బయల్దేరారు. 41 ఏండ్ల కిందట వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తొలిసారి స్పేస్ కు వెళ్లగా.. ఇప్పుడు శుక్లా రోదసికి వెళ్లిన రెండో ఇండియన్ గా నిలిచారు.
సాఫీగా సాగిన డాకింగ్..
శుభాంశు శుక్లా టీమ్కు ఎక్స్పెడిషన్ 73కి చెందిన ఆస్ట్రోనాట్లు వెల్ కమ్ చెప్పారు. దీనికి ముందు.. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తగా డాకింగ్ ప్రక్రియ ప్రారంభించారు. డ్రాగన్ క్యాప్సూల్.. ఐఎస్ఎస్లోని ఒక మాడ్యూల్తో డాక్ అయింది. మొత్తం 12 సెట్ల హుక్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యాక.. ఐఎస్ఎస్ హ్యాచ్ఓపెన్ అయింది.
యాక్సియం4 అస్ట్రోనాట్లను ఎక్స్పెడిషన్ 73కి చెందిన ఏడుగురు వ్యోమగాములు స్వాగతం పలికారు. వెల్కమ్ చెప్పిన వారిలో అన్నే మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, కిరిల్ పెస్కోవ్, జానీ కిమ్, సెర్గీ రిజికోవ్, అలెక్సీ జుబ్రిట్స్కీ, టకుయా ఒనిషి ఉన్నారు. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన వెంటనే శుక్లా టీమ్కు వెల్ కమ్ డ్రింక్ ఇచ్చారు. ఒకరినొకరు హగ్ చేసుకుని విష్ చేసుకున్నారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు.
14 రోజులపాటు అక్కడే..
శుక్లా టీమ్.. ఐఎస్ఎస్లో 14 రోజులు ఉంటుంది. భార రహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై మొత్తం 60 ప్రయోగాలు చేయనున్నారు. వీటిలో ఇస్రో తరఫున శుభాంశు 7 ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే 5 జాయింట్ స్టడీస్లోనూ శుక్లా పాల్గొననున్నారు.
‘స్పేస్’ నడకలు నేర్చుకుంటున్నా: శుక్లా
స్పేస్లో ఎలా నడవాలో చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నట్లు శుభాంశు శుక్లా తెలిపారు. ఐఎస్ఎస్ కు చేరుకున్న తర్వాత ఆయన లైవ్లో మాట్లాడారు. ‘‘స్పేస్ వాతావరణానికి ఇప్పుడిప్పుడే అలవాటుపడుతున్నా. అంతరిక్షంలో ఎలా తినాలి..? ఎలా నడవాలి..? అన్నవి నేర్చుకుంటున్నా. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. నా భుజంపై త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. కోట్లాది మంది భారతీయులు తోడుగా ఉన్నారని అనిపిస్తోంది.
స్పేస్ జర్నీలో నాది చిన్న అడుగే కావొచ్చు.. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు కీలక ముందడుగు. ఐఎస్ఎస్ లో వీలైనంత ఎక్కువ టైమ్ గడుపుతా. నా అనుభవాలను మీతో పంచుకునేందుకు ఎదురు చూస్తున్నా’’ అని శుభాంశు అన్నారు. తనతో పాటు ఈ రైడ్కు జాయ్ (ఒక హంస బొమ్మ) కూడా వచ్చిందని, ఇండియన్ కల్చర్లో హంస విజ్ఞాన చిహ్నమన్నారు.