
- తిరిగి దాడి చేస్తే తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటం
- పాకిస్తాన్కు భారత భద్రతా సలహాదారు వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ ఎటాక్ తర్వాత ఆ దేశానికి భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఉద్రిక్తతలను మరింత పెంచే ఉద్దేశం తమకు లేదని.. పాకిస్తాన్ కనుక భారత్పై దాడులు చేయాలని నిర్ణయించుకుంటే మరింత తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీగా ఉన్నామని హెచ్చరించారు. ఇండియా దాడుల తర్వాత పాక్ నేతలు ప్రతిదాడులు చేస్తామని బెదిరింపుకు పాల్పడిన నేపథ్యంలో బుధవారం ఆయన ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్, ఆ దేశ సైన్యం లక్ష్యంగా ఎటాక్ చేసే ఆలోచన తమకులేదని కేవలం టెర్రరిస్టు క్యాంపులే టార్గెట్గా దాడులు చేశామన్నారు.
ఆపరేషన్ సిందూర్ను ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు చెప్పారు. దాడులు కచ్చితమైనవి, నియంత్రితమైనవని పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా తదితర ప్రపంచ దేశాల ప్రతినిధులతో మాట్లాడి దాడుల విషయం వివరించారు. ఈ దాడులు ఉగ్రవాదంపై లక్ష్యంగా సాగాయని.. పౌరులు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు.