విశాఖలో నేవీ మిలాన్ -2024…సాగరతీరాన విన్యాసాలు

విశాఖలో నేవీ మిలాన్ -2024…సాగరతీరాన విన్యాసాలు

అంతర్జాతీయ నౌకా దళ (International navy) విన్యాసాలకు విశాఖ నగరం వేదిక కానుంది. 2022లో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌-2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ నగరం... తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్‌-2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది.  ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్‌ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొననున్నాయి. మిలాన్‌ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్‌( City Parade)ను ఈ నెల 22వ తేదీన ఆర్కే బీచ్‌లో నిర్వహించ నున్నారు. ఈ పరేడ్‌కు ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్‌ ధన్‌ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. మిలాన్‌-2024 విన్యాసాలను స్నేహం -ఐక్యత- సహకారం' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

ఇండియన్‌ నేవీ ఆధ్వర్యం లో జరిగే మిలాన్‌-2024ను ఈ సారి విశాఖలో నిర్వహించేలా అదికారులు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి 27 వరకు రెండు దశల్లో మిలాన్‌ నిర్వహించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిలాన్‌ వేడుకల్లో పాల్గొనేందుకు 50 దేశాల నుంచి అతిథులు వస్తున్నారు. మిలాన్‌ విన్యాసాల్లో పాల్గొనేందుకు 15 దేశాలకు చెందిన ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి.దీంతో విశాఖ సాగర తీరం సందడిగా మారింది. మిలాన్‌ కోసం వచ్చిన యుద్ధ నౌకల్లో మేరీటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూడా ఉంది. ఇండియన్‌ నేవీ నుంచి 20 యుద్ధనౌకలు, యుద్ధ విమాన వాహక నౌకలు విక్రాంత్‌(INS Vikranth), విక్రమాదిత్య , పీ8ఐ నిఘా విమానం, మిగ్‌ 29 (MIG29) యుద్ధ విమానాలు పాల్గొననున్నాయి. రెండు దశల్లో జరగనున్న మిలాన్‌ వేడుకలకు వేలాది మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. తొలి దశలో హార్బర్‌ ఫేజ్‌లో ఇంటర్నే షనల్‌ సిటీ పెరేడ్‌, మేరిటైమ్‌ సెమినార్‌, మిలాన్‌ టెక్‌ ఎక్స్‌పో, మిలాన్‌ విలేజ్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశ సీ ఫేజ్‌లో భాగంగా గగన తల పోరాట పటిమను ప్రదర్శించే విమానాలు, హెలికాప్టర్లు, యాంటీ సబ్‌మెరైన్‌ విన్యాసాలు ప్రదర్శించనున్నారు.

బీచ్‌ రోడ్డులో సిటీ పేరెడ్….

బీచ్‌ రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్‌ సిటీ పెరేడ్‌కి (City parade) లక్ష మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని నేవీ అధికారులు అంచనా వేశారు. 30 ఎన్‌క్లోజర్లు, 30 ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాట్లు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నా రు. వీవీఐపీ, వీఐపీ రక్షణ ఏర్పాట్లు, బందోస్తు తదితరాలను పోలీసు విభాగం ఆధ్వర్యంలో చేపట్టా రు. బీచ్‌ ప్రాంతంలో బార్‌కేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.మిలాన్‌ నేపథ్యంలో బీచ్‌ రోడ్డు, సముద్ర తీరంలో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నా యి. స్కై డైవర్స్‌ పారాచూట్ల సహాయంతో చేసిన విన్యాసాలు మెస్మరైజ్‌ చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలు అబ్బురపరిచాయి.ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ ఆర్మీతోపాటు పలు దేశాలకు చెందిన నేవీ సిబ్బంది చేపట్టిన మార్చ్‌ఫాస్ట్‌ ఆకట్టుకుంది.వేలాది మంది సందర్శ కులు బీచ్‌కు తరలివచ్చి విన్యాసాలను తిలకించారు. మిలాన్‌ వేడుకలు కోసం నగరవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వివిధ దేశాల నౌకాదళాల సందడి

భారత్‌తోపాటు యూఎస్‌ఏ, రష్యా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండొనేషియా, ఫ్రాన్స్, ఈజిప్ట్​, శ్రీలంక, వియత్నాం, మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్‌లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్, ఫిజీ, టోంగా, టోగో, పెరూ తదితర 50దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు విశాఖ చేరుకుంటున్నాయి.