మెల్బోర్న్: ఇండియన్ సంతతికి చెందిన ఓ సిక్కు వాలంటీర్కు ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నవంబర్ 3న ఈ అవార్డు ప్రకటించింది. వరదలు, కార్చిచ్చు, కరువు, కరోనా మహమ్మారి సమయాల్లో ప్రజలకు చేసిన సేవలకు గాను ఇండియన్ అరిజిన్ అమర్ సింగ్ను ఈ అవార్డుతో సత్కరించారు. ఆయనతో మరో ముగ్గురికి కూడా ఈ అవార్డు ప్రకటించారు. ‘లోకల్ హీరో’ కేటగిరీలో అవార్డు ఇచ్చింది. అమర్ సింగ్ ఏడేండ్ల క్రితం ‘‘టర్బన్స్ 4 ఆస్ట్రేలియా”ను స్థాపించాడు.
ఈ సంస్థ దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నిరాశ్రయులైన వారికి సాయం చేస్తూ ఉంటుంది. గడ్డం, తలపాగా కారణంగా తాను వివక్షకు గురైనట్లు ఆయన తెలిపారు. మతం, భాష, అలవాట్లు ఇతరులకు సాయం చేయడంలో అడ్డం కాకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ సంస్థను స్థాపించినట్లు వెల్లడించారు. ప్రతి వారం తమ సంస్థ ఫుడ్ లేని వారికి నిత్యావసరాలను పంపిణీ చేస్తుందన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో చాలా మందికి ఫుడ్ సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. తనకు వచ్చిన ఈ అవార్డు క్రెడిట్ అంతా తన టీమ్లోని వాలంటీర్లకు చెందుతుందని అమర్ సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.