Sensex Crash: నిన్న భారీగా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి. ఉదయం 10.29 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 325 పాయింట్ల నష్టంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 110 పాయింట్లు నష్టపోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 136 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 194 పాయింట్లు నష్టంలో ట్రేడవుతోంది. ఈ క్రమంలో సన్ ఫార్మా, ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
భారత మార్కెట్ల నష్టాలకు కారణాలు..
* ముందుగా ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో ఉండదని పావెల్ చేసిన కామెంట్స్ మార్కెట్లను నిరాశకు గురిచేశాయి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్డౌన్లో ఉన్నందున ఆర్థిక డేటా అందుబాటులో లేకపోవటంతో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం డిసెంబరులో కుదరని పనిగా ఆయన చెప్పారు.
* ఇక విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో అమ్మకాలకు దిగటం మరో కారణంగా ఉంది. బుధవారం ఒక్కరోజే వారు రూ.2వేల 540 కోట్లకు పైగా సొమ్మును వెనక్కి తీసుకున్నారు.
ఇక రానున్న రోజుల్లో అమెరికా చైనా మధ్య జరిగే వాణిజ్య చర్చలు, ఫెడ్ కామెంట్స్, ఇతర ప్రపంచ పరిణామాలు భారత మార్కెట్లను రానున్న కాలంలో ముందుకు నడిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
