
- 25,300 పైన నిఫ్టీ
- 575 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- ఫెడ్ పావెల్ మాటలతో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనా
- డాలర్ మారకంలో 88.07 కి రూపాయి విలువ
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్లో మళ్లీ ఊపందుకున్నాయి. మంగళవారం నష్టాల నుంచి రికవరీ అవుతూ, అర శాతానికి పైగా లాభపడ్డాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో పాటు, కంపెనీల రిజల్ట్స్ మెరుగ్గా ఉంటాయనే ఆశలతో మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. బెంచ్మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 575 పాయింట్లు పెరిగి 82,605.43 వద్ద ముగిసింది.
నిఫ్టీ 178 పాయింట్లు (0.71 శాతం) పెరిగి 25,323.55కి చేరింది. లోన్ గ్రోత్ పెరగడం, అసెట్ క్వాలిటీ స్థిరంగా ఉండడం, నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ తగ్గుదల తక్కువగా ఉండటంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేరు 7.6శాతం ర్యాలీ చేసింది. దీని ప్రభావంతో పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.7శాతం పెరిగింది. ఐసీఐసీఐ లాంబార్డ్ 8.9శాతం లాభపడి ఫైనాన్షియల్స్లో టాప్ గెయినర్గా నిలిచింది. ఐటీ షేర్లలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 7.2శాతం పెరిగింది.
బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్ టార్గెట్ ధర పెంచడంతో లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) షేరు 2.3శాతం లాభపడింది. మరోవైపు సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మెప్పించకపోవడంతో సైయింట్ డీఎల్ఎం 6శాతం పతనమైంది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కూడా ఒక శాతం వరకు లాభపడ్డాయి.
రియల్టీ, ఐటీ, మెటల్ షేర్లు ముందంజ
ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లపై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో గ్లోబల్గా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. “విదేశీ పెట్టుబడిదారులు భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతుండడంతో అమెరికా పదేళ్ల బాండ్ యీల్డ్ తగ్గింది. మరోవైపు రూపాయి బలపడింది”అని అన్నారు. వడ్డీ రేట్ల తగ్గుదల, వాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉండడం వలన రియల్టీ షేర్లు బుధవారం ఎక్కువగా పెరిగాయి.
గ్లోబల్ సెంటిమెంట్ మెరుగవ్వడంతో ఐటీ, మెటల్ ఇండెక్స్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు పుంజుకున్నాయి. జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు, వాల్ స్ట్రీట్లో బ్యాంక్ ఫలితాలు బాగుండటంతో పెట్టుబడిదారులు రిస్క్ అసెట్స్ వైపు మొగ్గుచూపారు. డాలర్ బలహీనమయ్యింది. యూరప్లో స్టాక్స్ 600 ఇండెక్స్ బుధవారం 0.7శాతం పెరగగా, ఫ్రాన్స్ సీఏసీ 40 ఇండెక్స్ 2.4శాతం లాభపడింది. అమెరికా ఫ్యూచర్స్ కూడా బుధవారం లాభాల దిశలో కదిలాయి.
నాస్డాక్ 0.5శాతం, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 0.4శాతం పెరిగాయి. ఆసియాలో ఎంఎస్సీఐ ఇండెక్స్ 2.1శాతం పెరగగా, హాంకాంగ్ మార్కెట్ 2శాతం లాభపడింది. ఇంకా, స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ (28 గ్రాముల)కి 4,200 డాలర్లు దాటి రికార్డు స్థాయికి చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గుదలపై అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్ వంటి సురక్షిత అసెట్ల వైపు మొగ్గుచూపుతుండడమే బంగారం ధరలు పెరగడానికి కారణం.
క్రూడ్ ఆయిల్ ధరలు మాత్రం తగ్గాయి. 2026లో సరఫరా అధికంగా ఉంటుందని ఎనర్జీ అసోసియేషన్ ఐఈఓ అంచనా వేసింది. అలాగే యూఎస్–చైనా మధ్య ట్రేడ్ టెన్షన్స్ వల్ల ఆయిల్ డిమాండ్ తగ్గుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.3శాతం తగ్గి 62.18 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం రూ.88.07 వద్ద ముగిసింది. ఆర్బీఐ జోక్యంతో రూపాయి విలువ పుంజుకుంటోంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 0.2శాతం తగ్గి 98.8కి చేరింది.