దేశంలో నవంబర్ 2025 నుంచి అమలులోకి వచ్చిన కొత్త లేబర్ చట్టాల కారణంగా దేశంలోని ఐటీ రంగానికి భారీ ఆర్థిక భారం పడింది. దిగ్గజ కంపెనీలైన TCS, Infosys, HCLTech ముగ్గురూ కలిపి డిసెంబర్ త్రైమాసికంలో రూ.4వేల 373 కోట్ల అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది కంపెనీల లాభాలను భారీగా తగ్గించింది.
TCS కంపెనీ మొదట ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరి 12న ప్రకటించిన Q3 ఫలితాల్లో రూ.2వేల 128 కోట్ల ఒక్కసారి ఖర్చు చేసింది. దీనిలో రూ.వెయ్యి 800 కోట్లు గ్రాట్యుటీ సర్దుబాట్లకు, రూ.300 కోట్లు లీవ్ లయబిలిటీలకు వెళ్లాయి. ఫలితంగా కంపెనీ నికర లాభం 14% తగ్గి రూ.10వేల 657 కోట్లకు చేరింది. అయినా TCS ఆపరేటింగ్ మార్జిన్ 25.2%లో స్థిరంగా కొనసాగింది. భవిష్యత్తులో 10-15 బేసిస్ పాయింట్ల ప్రభావం మాత్రమే ఉంటుందని CFO సమీర్ సెక్సారియా వెల్లడించారు.
ALSO READ : గ్రో ఏఎంసీలో స్టేట్ స్ట్రీట్ రూ.580 కోట్ల పెట్టుబడి
HCLTech కూడా జనవరిలో రూ.956 కోట్లుఖర్చు చేసింది. ఇది వారి Q3 లాభాన్ని 11% తగ్గించి రూ.4వేల 082 కోట్లకు పరిమితం చేసింది. లేబర్ చట్టాల మార్పు కారణంగా భవిష్యత్ ప్రభావం 10-20 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉంటుందని CEO సీ. విజయకుమార్ వెల్లడించారు.
ఇక ఇన్ఫోసిస్ విషయానికి వస్తే కంపెనీ జనవరి మాసంలో రూ.వెయ్యి289 కోట్లు ప్రొవిజన్ చేసింది. గ్రాట్యుటీ, లీవ్ లయబిలిటీల పెరిగిన భారం కారణంగా ఆపరేటింగ్ మార్జిన్ 21% నుంచి 18.4%కి పడిపోయింది. వార్షికంగా 15 బేసిస్ పాయింట్లు ప్రభావం కొత్త చట్టాల వల్ల ఉంటుందని CFO జయేష్ సంఘ్రాజ్కా అన్నారు. ఈ క్రమంలో అడ్జస్టెడ్ మార్జిన్ 21.2% ఉండేదని స్పష్టం చేశారు.
