
లండన్: యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో మాస్టర్స్ డిగ్రీ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని స్టూడెంట్లకు జాహ్నవి జైన్ అనే భారతీయ మహిళ హెచ్చరించారు. ప్రస్తుతం యూకేలో పరిస్థితి బాగా లేదని, ఉద్యోగాలు లేవన్నారు. మాస్టర్స్ చేసిన చాలా మంది తమ సొంత దేశాలకు వెళుతున్నారని ‘ఎక్స్’ లో ఆమె తెలిపారు.
ఇండియాలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన అనంతరం మాస్టర్స్ కోసం జాహ్నవి యూకే వెళ్లారు. ప్రస్తుతం లండన్ లోని ఓ కంపెనీలో ఆమె మార్కెటింగ్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నారు. యూకేలో మాస్టర్స్ చేశాక ఉద్యోగాలు రాకపోవడంతో తన బ్యాచ్ లో 90 శాతం మంది ఉత్త చేతులతో సొంత దేశానికి వెళ్లారని వెల్లడించారు. ఖర్చులు భరించేంత స్థోమత ఉంటే రావచ్చన్నారు. ఆమె చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.