- రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న ఇండియన్స్
- సెప్టెంబర్ క్వార్టర్లో బ్రిటీషర్లను దాటి టాప్ పొజిషన్లోకి
- దుబాయ్లో పెరుగుతున్న లగ్జరీ ఇండ్ల ధరలు
న్యూఢిల్లీ: దుబాయ్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను కొనడానికి ఇండియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బెటర్హోమ్స్ రెసిడెన్షియల్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం, దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఫారినర్లలో ఇండియన్స్ టాప్ పొజిషన్లో నిలిచారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో మనం రెండో ప్లేస్లో నిలవగా, అప్పుడు బ్రిటిషర్లు మొదటి ప్లేస్లో ఉన్నారు. సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో బ్రిటిషర్లను దాటి నెంబర్ వన్ పొజిషన్కు ఇండియన్స్ చేరుకున్నారు.
దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విస్తరించడంలో ఇండియన్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని బెటర్హోమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. దుబాయ్లో ఇల్లు కొనుక్కోవడం, లాభాల కోసం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం లేదా గోల్డెన్ వీసా (ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లు ఉండొచ్చు) కోసం అక్కడ పెట్టుబడులు పెట్టడంలో ఇండియన్స్ టాప్లో ఉన్నారని ఈ రిపోర్ట్ వివరించింది. ఇల్లు కొనుక్కోవడానికో లేదా లాభాల కోసమో..ఏది ఏమైనా దుబాయ్లో ప్రాపర్టీలు కొంటున్న వారిలో ఇండియన్లు టాప్లో ఉన్నారని బెటర్హోమ్స్ సీఈఓ రిచర్డ్ వైండ్ పేర్కొన్నారు.
గత 18 నెలల్లో మొదటిసారిగా రష్యన్లు టాప్ 3 పొజిషన్లలో నిలవలేదు. అయినప్పటికీ ఇండియన్లు, బ్రిటిషర్ల నుంచి భారీ డిమాండ్ ఉందని, చాలా మంది గోల్డెన్ వీసా కోసమే దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని రిచర్డ్ అన్నారు. గోల్డెన్ వీసా పొందితే ఇన్వెస్టర్లు, వారి ఫ్యామిలీ దుబాయ్లో ఐదేళ్లు ఉండొచ్చు. దీనిని 10 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు. కానీ, గోల్డెన్ వీసా పొందాలంటే దుబాయ్లో కనీసం రూ.4.5 కోట్ల విలువైన ప్రాపర్టీ కొనాలి.
యూఏఈకి 4,500 మంది మిలియనీర్లు
దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో 28,249 ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఇవి 4 శాతం పెరగగా, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే 23 శాతం ఎక్కువ. విల్లాలు, టౌన్హౌస్లకు డిమాండ్ భారీగా పెరిగిందని, అపార్ట్మెంట్ల డీల్స్ మాత్రం తగ్గాయని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దుబాయ్లో విదేశీయులు ఈ ఏడాది జనవరి– జులై మధ్య సుమారు లక్ష పెరిగారని రిచర్డ్ వెల్లడించారు.
ఈ ఏడాది యూఏఈ సుమారు 4,500 మంది మిలియనీర్లను ఆకర్షిస్తుందని అంచనా వేశారు. లగ్జరీ సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఇక్కడ ప్రాపర్టీల ధరలు, రెంట్లు పెరుగుతున్నాయని రిచర్డ్ అన్నారు. ఈ ఏడాది జనవరి– జులై మధ్య దుబాయ్లో లగ్జరీ ఇండ్ల ధరలు ఏకంగా 50 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగాయని, కరోనా సంక్షోభంలో నమోదైన రేట్లతో పోలిస్తే 225 శాతం ఎగిశాయని పేర్కొన్నారు.
అందరి చూపు అటు వైపేగ్లోబల్గా చాలా దేశాల ప్రజలు
దుబాయ్లో ప్రాపర్టీలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్కు సేఫ్ హెవెన్ కావడం, ట్యాక్స్లు తక్కువగా ఉండడం, పెట్టుబడులపై లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడం వంటివి ఆకర్షిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇండియన్లు, బ్రిటిషర్లు ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారని వెల్లడించారు. రష్యా ఐదో ప్లేస్కు పడిపోయిందని చెప్పారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఫారినర్లలో మొదటిసారిగా టర్కీ టాప్–10 లో చోటు దక్కించుకుంది.
ఈ దేశ ఎకానమీ బాగోలేకపోవడంతో అక్కడి ప్రజలు దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్ వంటి దేశాల ప్రజలు కూడా దుబాయ్లో ప్రాపర్టీ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యూఏఈ ప్రజలు కూడా తమ టాప్ సిటీ దుబాయ్లో ప్రాపర్టీలు భారీగా కొంటున్నారు.