- 2021-22లో కొత్తగా ఎన్రోల్ చేసుకున్న ఇండియన్ స్టూడెంట్లు 75 వేలు
- వీరిలో హైదరాబాద్ నుంచి వెళ్లిన వారే 22,500 మంది
- మనకన్నా వెనకనే ముంబై, ఢిల్లీ సిటీలు..
- ఐఐఈ ఓపెన్ డోర్స్ రిపోర్ట్ లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పెద్ద చదువుల కోసం అమెరికా యూనివర్సిటీలకు వెళ్లేందుకు మన రాష్ట్రానికి చెందిన స్టూడెంట్లు క్యూ కడుతున్నారు. వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్లే స్టూడెంట్లలో ఇండియన్స్ ఎక్కువగా ఉండగా.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో చదివేందుకు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఇండియన్స్లో 30 శాతం మంది హైదరాబాదీలే కావడం విశేషం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ఇటీవల పబ్లిష్ చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఈ విషయాలను వెల్లడించింది.ఇండియన్ సిటీస్ లో హైదరాబాద్ టాప్ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికాకు స్టూడెంట్లను పంపడంలో ఇండియన్ సిటీస్ లోనే హైదరాబాద్ టాప్ లో నిలిచింది. 2021–22 ఎకడమిక్ ఇయర్ లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడం కోసం వివిధ దేశాల నుంచి 2 లక్షల 61 వేల మంది అమెరికన్ యూనివర్సిటీల్లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికాలో చదివేందుకు స్టూడెంట్ వీసా పొందిన వారిలో 75 వేల మంది ఇండియన్ స్టూడెంట్లే ఉన్నారు. ఇందులో 22,500 మంది(30%) హైదరాబాదీలే ఉండటం విశేషం. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ముంబై, ఢిల్లీ సిటీలు ఉన్నాయి. ఈ రెండు సిటీలను కలిపినా హైదరాబాద్ కంటే తక్కువగానే కొత్త ఎన్రోల్మెంట్లు ఉన్నాయి.
చేరుతున్న కోర్సులివే..
అమెరికన్ వర్సిటీల్లోని కొన్ని కోర్సులకే క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ మొదలైన కోర్సుల్లో ఎక్కువగా ఇండియన్లు జాయిన్ అవుతున్నారు. కంప్యూటర్ కోర్సులతోపాటు బిజినెస్, సోషల్ సైన్స్ కోర్సులకూ మస్తు డిమాండ్ ఉంది.
ఇండియన్ స్టూడెంట్లు 19 శాతం పెరిగిన్రు
అమెరికాలో చదివే ఫారిన్ స్టూడెంట్ల సంఖ్య కరోనా ముందు పరిస్థితికి చేరుకుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2022లో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య 19 శాతం పెరిగింది. మొత్తంగా అమెరికన్ యూనివర్సిటీల్లో రిజిస్టర్ అయిన 10 లక్షల మంది ఫారిన్ స్టూడెంట్స్ లో 21 శాతం మంది ఇండియన్సే అని ఓపెన్ డోర్స్ రిపోర్ట్ వెల్లడించింది. 2020–21లో అమెరికాలో పైచదువులు చదివేందుకు రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 1,67,582గా ఉంటే.. 2021-22 నాటికి ఈ సంఖ్య 1,99,182కు పెరిగింది. కరోనాకు ముందు ఇండియాతో పోలిస్తే చైనా స్టూడెంట్స్ అమెరికాకు ఎక్కువగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా కారణంగా చైనా స్టూడెంట్స్ కు వీసాల జారీలో కొన్ని రూల్స్ పెట్టడంతో చేయడంతో వారి రాక తగ్గింది. దీంతో 2020–21తో పోల్చితే 2022–23లో అమెరికా వెళ్లే ఇండియన్ స్టూడెంట్లు చైనా స్టూడెంట్ల సంఖ్యను దాటిపోయే అవకాశం ఉందని ఓపెన్ డోర్స్ రిపోర్ట్ పేర్కొంది.