ఇండియా కూటమిదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి

ఇండియా కూటమిదే అధికారం : సీఎం రేవంత్  రెడ్డి
  •      కాంగ్రెస్ ​సునామీలో బీజేపీ కొట్టుకుపోతది: సీఎం రేవంత్​రెడ్డి
  •     బీజేపీకి మ్యాజిక్​ ఫిగర్​ రాదు.. ఏ పార్టీ మద్దతు ఇవ్వదు 
  •     సీఎంగా, పీఎంగా పనిచేసినా మోదీకి రాజ్యాంగంపై అవగాహన లేదు
  •     ఒవైసీ గెలుపునకు బీజేపీ కృషి చేస్తున్నది
  •     కేసీఆర్​ ఫ్రస్టేషన్​లో కేఏ పాల్​లాగా మాట్లాడుతున్నడు..
  •     ఆయనపై నాకు సానుభూతి ఉన్నది
  •     వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమే 
  •     కొడంగల్​లో ఓటేసిన ముఖ్యమంత్రి

కొడంగల్, వెలుగు: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి మ్యాజిక్​ ఫిగర్​ రాదని పేర్కొన్నారు. సోమవారం రేవంత్​రెడ్డి కొడంగల్​లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన తన నివాసంలో మాట్లాడారు. దేశంలో 336 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మ్యాజిక్​ ఫిగర్​ రాకపోతే.. బీజేపీ, ఎన్​డీఏ కూటమికి మద్దతు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధంగా  లేవని చెప్పారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన మోదీకి రాజ్యాంగంపై అవగాహన లేదని రేవంత్​ విమర్శించారు. 

‘‘దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్​డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదు. దేశ ప్రజలను మోదీ తన మాయమాటలతో మోసం చేస్తున్నారు. జూన్​4న వచ్చే కాంగ్రెస్​సునామీలో బీజేపీ కొట్టుకుపోవడం ఖాయం” అని రేవంత్ పేర్కొన్నారు.  రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా మోదీ, బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఎందుకు కంప్లయింట్ చేయడం లేదని ప్రశ్నించారు.

ఎవరో సృష్టించిన వీడియోకు తనను నిందితుడిగా చేర్చడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులతో మోదీ, అమిత్​ షా తనను బెదిరిస్తున్నారని చెప్పారు. గతంలో జేడీఎస్​ నాయకుడు దేవెగౌడ కుటుంబంపై మోదీ అవినీతి ఆరోపణలు చేశారని, ఎన్​డీఏకు మద్దతు ఇవ్వగానే వారిపై అవినీతి మరకలు తొలగిపోయాయని అన్నారు. కాంగ్రెస్​కు అదానీ, అంబానీ డబ్బులు ఇస్తున్నారని మోదీ ఆరోపణలు చేస్తున్నారని, అవే నిజమైతే వారి ఇండ్లు, ఆఫీసులపై సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు నిర్వహించాలని డిమాండ్​ చేశారు. 

మోదీకి 75 ఏండ్లు నిండుతున్నయ్ 

వచ్చే ఏడాది సెప్టెంబర్​ 17నాటికి మోదీకి 75 ఏండ్లు నిండుతున్నాయని సీఎం రేవంత్ అన్నారు.  ఒకవేళ ఎన్​డీఏ అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలని సూచించారు. ఒవైసీ గెలుపు కోసం బీజేపీ కృషి చేస్తున్నదని అన్నారు. పార్లమెంట్​ ఎన్నికలు వంద రోజుల కాంగ్రెస్​ పాలనకు రెఫరెండం అని తెలిపారు. తెలంగాణలో 14 పార్లమెంట్​ స్థానాలను కాంగ్రెస్​ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. రైతుబంధు ఎలా ఇచ్చామో అలాగే ప్రంద్రాగస్టులోగా రైతులకు 2లక్షల రుణమాఫీ చేసీ తీరుతామని  స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసి, పెట్టుబడులను గుజరాత్​కు తరలించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోందని రేవంత్​ ఆరోపించారు. కన్న కూతురు జైలుకు పోవడం, అధికారం కోల్పోవడంతో కేసీఆర్​ మానసిక ఒత్తిడి, నిరాశ, భావోద్వేగంతో ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్​ కూడా కేఏ పాల్​లాగే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనపై తనకు సానుభూతి ఉన్నదని అన్నారు. రేవంత్​ రెడ్డి వెంట మహబూబ్​నగర్ ​ఎంపీ అభ్యర్థి వంశీచంద్​ రెడ్డి ఉన్నారు.