న్యూఢిల్లీ: దేశ ఎకానమీ 2003–2007 టైమ్లో వృద్ధి చెందనట్టే ప్రస్తుతం వృద్ధి చెందుతోందని మోర్గాన్ స్టాన్లీ ఓ రిపోర్ట్లో పేర్కొంది. అప్పుడు జీడీపీ ఏడాదికి సగటున 8.6 శాతం గ్రోత్ రేట్ సాధించిందని, ప్రస్తుతం కూడా పరిస్థితులు అలానే ఉన్నాయని వెల్లడించింది. భారీగా పెట్టుబడులు వస్తుండడంతో దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. క్యాపెక్స్ పెరగడంతో ఎకానమీ నిలకడగా వృద్ధి చెందుతోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. ‘వినియోగం తగ్గినా, ప్రస్తుతం జీడీపీ గ్రోత్ను దేశంలోకి వస్తున్న పెట్టుబడులు ముందుండి నడుపుతున్నాయి.
ప్రభుత్వం చేసే క్యాపెక్స్ తగ్గినప్పటికీ ప్రైవేట్ కంపెనీలు చేసే క్యాపెక్స్ పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గినా, పట్టణాల్లో వినియోగం ఊపందుకుంది. గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా వాటా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ స్టేబుల్గా ఉంది’ అని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. పెట్టుబడులు – జీడీపీ రేషియో 2003–2007 టైమ్లో 27 శాతం నుంచి 39 శాతానికి చేరుకుందని, ఇదే పీక్ లెవెల్ అని తెలిపింది. 2011 – 2021 మధ్య పెట్టుబడులు – జీడీపీ రేషియో తగ్గిందని, కానీ ప్రస్తుతం 34 శాతం దగ్గర ఉందని వివరించింది. రానున్న ఆర్థిక సంవత్సరాల్లో ఈ నెంబర్ 36 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2003–2007 లో ఇన్ఫ్లేషన్ 4.8 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది.
