![డిసెంబర్లో 23.89 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు](https://static.v6velugu.com/uploads/2023/01/India's-exports-decline-over_ot9F4P6szx.jpg)
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు కిందటి నెలలో 12.2 శాతం పడిపోయాయి. డిసెంబర్, 2022లో 34. 48 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు (గూడ్స్) ఎగుమతి అవ్వగా, అంతకు ముందు ఏడాది డిసెంబర్లో 39.27 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. దిగుమతులు కూడా 60.33 బిలియన్ డాలర్ల నుంచి 58.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దేశ ట్రేడ్ డెఫిసిట్ (వాణిజ్య లోటు) డిసెంబర్లో 23.89 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్లో ట్రేడ్ డెఫిసిట్ 21.10 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. అదే కిందటేడాది నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో ట్రేడ్ డెఫిసిట్ ఫ్లాట్గా ఉంది. కిందటేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య దేశ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే టైమ్లో దిగుమతులు 25 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. గ్లోబల్గా సమస్యలున్నప్పటికీ దేశ ఎగుమతులు నిలకడగా ఉన్నాయని కామర్స్ సెక్రెటరీ సునిల్ బర్త్వాల్ అన్నారు. నెదర్లాండ్స్, బ్రెజిల్ వంటి కొత్త మార్కెట్లకు పెట్రోలియం ప్రొడక్ట్స్ (పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటివి) ఎగుమతువుతున్నాయని చెప్పారు. యుద్ధం వలన రష్యా నుంచి చాలా చౌకకు క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, మన దగ్గర ఉన్న రిఫైనింగ్ కెపాసిటీని వాడుకొని పెట్రోలియం ప్రొడక్ట్లను పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నామని వివరించారు.
రెండేళ్ల దిగువకు హోల్సేల్ ఇన్ఫ్లేషన్..
దేశంలో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డిసెంబర్లో 22 నెలల దిగువకు వచ్చింది. ఆహార పదార్ధాలు, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) కిందటి నెలలో 4.95 శాతానికి తగ్గింది. కిందటేడాది నవంబర్లో డబ్ల్యూపీఐ 5.85 శాతంగా రికార్డయ్యింది. 2021 లోని నవంబర్లో 14.27 శాతంగా నమోదయ్యింది. 2021 ఫిబ్రవరి తర్వాత 5 % కిందకు రావడం ఇదే మొదటిసారి.