న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ ఇష్యూ ద్వారా చేపట్టిన రూ.వెయ్యి కోట్ల నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్(ఎన్సీడీలు) విక్రయం కేవలం 45 నిమిషాల్లోనే పూర్తయింది. పెట్టుబడిదారులు ఈ బాండ్ల కొనుగోలుకు భారీగా ఆసక్తి చూపారు. రూ.500 కోట్ల బేస్ ఇష్యూ 10 నిమిషాల్లోనే సబ్స్క్రయిబ్అయింది. మిగిలిన రూ.500 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్ కూడా గంటలోపు అమ్ముడైంది.
ఈ బాండ్లపై ఏడాదికి 8.90 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. వీటిని బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ చేస్తారు. సేకరించిన నిధుల్లో 75 శాతం పాత అప్పులు తీర్చడానికి, మిగిలిన నిధులను సంస్థాగత అవసరాలకు వాడతారు. అదానీ గ్రూపుపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని సంస్థ తెలిపింది. ఇన్వెస్టర్లు 24, 36, 60 నెలల కాలపరిమితితో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖపట్నంలోని గూగుల్-అదానీ ఏఐ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులను సంస్థ నిర్వహిస్తోంది.
