
హైదరాబాద్, వెలుగు: పేపర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతదేశంలో మొదటి జాతీయ పేపర్ ఎక్స్పో పేప్ ఎక్స్పో 2025ను హైటెక్స్లో ప్రగతి ఆఫ్సెట్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పరుచూరి నరేంద్ర ప్రారంభించారు. ఈ ఎక్స్పో మూడు రోజులు జరగనుంది. ఈనెల 8వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా పాపిరస్ ఎక్స్పో ఎల్ఎల్పీ సీఈఓ నిర్మల్ కుహాద్ మాట్లాడుతూ తాము స్థాపించిన పేపర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
‘‘పేపర్ వినియోగం ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఫౌండేషన్ స్థాపించాం. మన దేశంలో పేపర్ వినియోగం అతి తక్కువ స్థాయిలో ఉంది. పేపర్ వినియోగం వనరుల నాశనానికి (అటవీ నష్టం) దోహదం చేస్తుందన్న అపోహను తొలగించడమే ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. భారతదేశంలో తయారవుతున్న, వినియోగిస్తున్న పేపర్లో సుమారు 80 శాతం రీసైకిల్ చేయబడిన వనరుల నుంచే వస్తుంది”అని ఆయన వివరించారు.