న్యూఢిల్లీ : దేశంలో తయారీ రంగం పనితీరు కిందటి నెలలో 18 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇన్ఫ్లేషన్ తగ్గినా, ఫ్యాక్టరీ ఆర్డర్లు , ఉత్పాదకత కొద్దిగా పెరిగినా మాన్యుఫాక్చరింగ్ యాక్టివిటీ పడిందని పీఎంఐ సర్వే పేర్కొంది. ఈ ఏడాది గ్రోత్ బాగుంటుందని తయారీ రంగంలోని కంపెనీలు అంచనా వేస్తున్నాయంది. ప్రతి నెల విడుదలయ్యే మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) డిసెంబర్లో 54.9 గా నమోదయ్యింది. అంతకు ముందు నెలలో ఇది 56 శాతంగా ఉంది. కాగా, పీఎంఐ 50 కంటే పైన ఉంటే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. ఎస్ అండ్ పీ గ్లోబల్ తయారు చేసిన హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ సర్వేలో సుమారు 400 కంపెనీలు పాల్గొన్నాయి.
‘దేశ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ కిందటి నెలలో మందగించినా విస్తరణ బాటలోనే కొనసాగుతోంది. ఫ్యాక్టరీలకు వచ్చే కొత్త ఆర్డర్లు, ఉత్పాదకతలో గ్రోత్ నెమ్మదించింది’ అని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి అన్నారు. కొత్త బిజినెస్లు విస్తరిస్తున్నాయని, మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని, ఫెయిర్లు, ఎగ్జిబిషన్లు కన్జూమర్లను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఇండియాలో తయారైన ప్రొడక్ట్లకు గ్లోబల్ మార్కెట్ల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయని, వరుసగా 21 నెలలోనూ వృద్ధి కనిపించిందని భండారి పేర్కొన్నారు. ముడిసరుకుల ధరల పరంగా చూస్తే ఇన్ఫ్లేషన్ తొమ్మిది నెలల కనిష్టానికి తగ్గిందని ఆయన వివరించారు.