- రాజకీయాలతో నా ప్రిపరేషన్స్ కు ఆటంకం కలుగుతోంది : లవ్లీనా
- కామన్వెల్త్ గేమ్స్ మరో రెండు రోజుల్లో..
బర్మింగ్హామ్ : కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ తెస్తుందని ఆశిస్తున్న ఇండియా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సోమవారం సంచలన విషయాలు వెల్లడించింది. కొందరు అధికారులు తన కోచ్లను వేధిస్తున్నారని చెప్పింది. దాంతో, తన ప్రిపరేషన్స్కు ఆటంకం కలుగుతోందని తెలిపింది. ఇండియా బాక్సింగ్ టీమ్ ఆదివారం రాత్రి బర్మింగ్హామ్ గేమ్స్ విలేజ్కు చేరుకుంది. అయితే, అక్రెడిటేషన్ లేనందున లవ్లీనా పర్సనల్ కోచ్ సంధ్యా గురుంగ్ను విలేజ్లోకి అనుమతించలేదు.
సంధ్యతో పాటు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ ఆమేయ్ కోలేకర్ను తనతో పాటు కామన్వెల్త్ పంపించాలని బాక్సర్ కోరినా బాక్సింగ్ ఫెడరేషన్ అధికారులు అతని పేరును లిస్ట్లో చేర్చలేదు. దాంతో, లవ్లీనా ట్విటర్ పోస్ట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ‘నేను ఒలింపిక్ మెడల్ నెగ్గడానికి ఎంతో కృషి చేసిన నా కోచ్లను తరచూ పక్కనబెడున్నారు. నాతో పాటు వచ్చిన సంధ్య గేమ్స్ విలేజ్ బయట నిల్చున్నారు. పోటీలకు ఎనిమిది రోజుల ముందు మరో కోచ్ను ఇండియా పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను గేమ్స్పై ఎలా ఫోకస్ పెట్టాలి? వరల్డ్ చాంపియన్షిప్స్నకు ముందు కూడా నేను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా. ఈ రాజకీయాలను దాటుకొని నా దేశం కోసం పతకం గెలుస్తానని అనుకుంటున్నా’ అని లవ్లీనా ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ లవ్లీనా కోచ్కు అక్రెడిటేషన్ అందించి సమస్యను పరిష్కరించాలని ఐఓఏను ఆదేశించింది.
