
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియా సరుకు వాణిజ్య లోటు 32.15 బిలియన్ డాలర్లకి చేరింది. ఇది గత 11 నెలల్లో అత్యధికం. అమెరికా ఆగస్టులో భారత వస్తువులపై టారిఫ్ను 50శాతానికి పెంచిన తర్వాత, దిగుమతులు ఎగుమతుల కంటే వేగంగా పెరగడమే ఇందుకు కారణం. ఇది ఆర్థికవేత్తల అంచనా అయిన 25.13 బిలియన్ డాలర్లను మించిపోయింది. అమెరికాతో ఈ వారం జరగనున్న ట్రేడ్ చర్చల నేపథ్యంలో, భారత్ అమెరికా నుంచి ఎనర్జీ దిగుమతులు పెంచేందుకు సిద్ధంగా ఉంది.
అలాగే రష్యా ఆయిల్ కొనుగోలుపై ఉన్న ఆందోళనలను పరిష్కరించాలనుకుంటోంది. సెప్టెంబర్లో ఎగుమతులు 36.38 బిలియన్ డాలర్లకి పెరిగాయి. అయితే టెక్స్టైల్, రొయ్యలు, జెమ్స్ అండ్ జ్యువెలరీపై టారిఫ్ ప్రభావం కనిపించింది. దిగుమతులు మాత్రం 68.53 బిలియన్ డాలర్లకి ఎగిశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో యూఎస్కి ఎగుమతులు ఏడాది లెక్కన 13శాతం పెరిగి 45.82 బిలియన్ డాలర్లకి, దిగుమతులు 15.29 బిలియన్ డాలర్లకి చేరాయి. యూఎస్తో ఇండియా 15.53 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు సాధించింది.