ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న తెలంగాణను తిరిగి గాడిలో పెట్టడం ఎంతటి సవాలో తెలిసీ.. ఆ గురుతర బాధ్యతను మన సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకుని ‘ప్రజా పాలన’కు కొత్త నిర్వచనం ఇచ్చారు. వచ్చే 20 ఏండ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలి? అనే దూరదృష్టితో భావి తరాల భవిష్యత్ విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. గ్రామీణ వ్యవస్థ పటిష్టత నుంచి పట్టణాభివృద్ధి.. విద్య, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, టూరిజం, నిరుపేదల సంక్షేమం వరకు.. ప్రతి రంగాన్నీ అభివృద్ధి పథంలో నిలిపేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేశారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశలో నవీన ఆలోచనలతో, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొచ్చే పథకాలతో ఈ రెండేండ్లలో ప్రజా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి పునాది వేసింది.
తెలంగాణను సమానత్వం, సమృద్ధి, సంక్షేమం దిశగా నడిపించాలన్న సంకల్పంతో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రెండేండ్లుపూర్తి చేసుకుంది. రెండేండ్ల పాలనలో ఆరు గ్యారెంటీల అమలుకు రూ.76,382 కోట్లు ఖర్చు చేసిందంటేనే ప్రజల కోసం నిరంతరం పని చేయాలన్న తపన ప్రజాప్రభుత్వానికి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి రూ.8,402 కోట్లు, గృహజ్యోతికి రూ.3,438 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.3,200 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.3,000 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.20,616 కోట్లు, రైతు భరోసాకు రూ.20,000 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు రూ. 15,600 కోట్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్కు రూ.700 కోట్లు వెచ్చించింది ప్రజా ప్రభుత్వం.
వ్యవసాయ రంగంలో సరికొత్త శిఖరాలు
ప్రజా ప్రభుత్వం గడిచిన రెండేండ్లలో రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి, రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు చేసింది. వ్యవసాయ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో 6.7 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. వ్యవసాయ రంగం వాటా గత ఏడాది రూ. 1,00,004 కోట్ల నుంచి 2024-25 అంచనాల ప్రకారం రూ. 1,06,708 కోట్లకు చేరింది.
2024-25 సీజన్లో సాగు విస్తీర్ణం 220.77 లక్షల ఎకరాలకు పెరగడంతోపాటు దిగుబడి రికార్డ్ స్థాయిలో 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
తొలి ఏడాదిలోనే రూ. 20,616 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ ఈ ఏడాది వానాకాలం పంటలకు కేవలం 9 రోజుల్లోనే రూ. 8,744 కోట్ల నిధులను జమ చేసి రికార్డు నమోదు చేసింది. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి, సన్నాలు అమ్మిన రైతులకు ఇప్పటికే రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది. ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు నష్టపరిహారం అందేలా పంటల బీమాను పునరుద్ధరించింది.
ఉద్యోగాల మైలు రాయి దిశగా..
'యువతకు ఉద్యోగం.. తెలంగాణ భావోద్వేగం' అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం రెండేళ్లలో 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసింది. మరో 8,632 పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయి. రెండేండ్లలో ప్రజా ప్రభుత్వం 61,379 ఉద్యోగాలు ఇచ్చింది. తొలి ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి 10,006 పోస్టులు భర్తీ చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు ఉన్న అడ్డంకులను అధిగమించి, ఎంపికైన 16,067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది.
మెడికల్, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు విషయానికి వస్తే, ఆరోగ్యశాఖలో 8,666 మంది ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది. రద్దైన గ్రూప్-1 పరీక్షను కొత్త నోటిఫికేషన్తో (562 పోస్టులు) విజయవంతంగా నిర్వహించింది. గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసి 782 మందికి నియామక పత్రాలు అందించింది.
ఆరోగ్యం ప్రజల భద్రత
రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి, మొత్తం చికిత్సల సంఖ్యను 1,835కి పెంచింది. నెట్వర్క్ హాస్పిటల్స్ సంఖ్య 496కి పెరిగింది. 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చి, ఎంబీబీఎస్ సీట్లను 4,140కి పెంచింది. కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు (960 సీట్లు), 28 పారామెడికల్ కాలేజీలు (1680 సీట్లు) ప్రారంభించింది.
ఉచిత వైద్య సేవల కోసం ప్రతి జిల్లాలో ఎన్సీడీ క్లినిక్స్ను అందుబాటులోకి తెచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్లను ప్రారంభించింది. కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మొత్తం 102 సెంటర్లు ఉన్నాయి. లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 213 కొత్త అంబున్స్లను ప్రారంభించి, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ అందుబాటులోకి తెస్తోంది.
మహిళా ఆర్థిక స్వావలంబనే ధ్యేయం
మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.26,000 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. కొత్తగా 2,25,110 సంఘాలు రూ.4825.54 కోట్ల వ్యాపారాలను ప్రారంభించాయి. 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ సచివాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్లు, పర్యాటక ప్రదేశాల్లో 214 ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి.
అంతే కాదు.. పారిశ్రామిక వేత్తలతో..
పోటీపడేలా మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుంది. మహిళా సమాఖ్యల వద్ద ఉన్న రూ.54 కోట్లతో 151 కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో, మహిళా సంఘాలను బస్సులకు ఓనర్లను చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరల పంపిణీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది.
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ‘జయ జయహే తెలంగాణ’ గేయానికి రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం. ప్రజా ప్రభుత్వం ‘గ్లోబల్ సమిట్’ యావత్ తెలంగాణకు గర్వకారణం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపే దిశగా ఈ ప్రస్థానం కొనసాగుతోంది.
ఇందిరా శోభన్, కాంగ్రెస్ సీనియర్ నేత

