
హనుమకొండ, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రొసీడింగ్స్పేపర్లను సంబంధిత ఎమ్మెల్యేలు అందజేస్తారని, 6వ తేదీ వరకు ఇండ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లకు సూచించారు. 9నాటికి వంద శాతం ఇండ్ల పనులు స్టార్ట్ కావాలని చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇండ్లు, లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్ సర్టిఫికెట్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలపై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకంపై గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్, రాజీవ్ యువ వికాసం వివరాలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. జూన్ చివరి నాటికి ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం మొదటి దశలో రూ.50 వేలు, రూ.లక్ష లోపు రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికను జూన్ 9 నాటికి పూర్తి చేయాలన్నారు. ఆ జాబితాను సబ్సిడీ రుణాల మంజూరు కోసం జిల్లా ఇన్చార్జి మంత్రికి అందించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో భూభారతి పైలట్ మండలంగా ఎంపికైన నడికూడ మండలంలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, నడికూడ తహసీల్దార్ రవీందర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా ఇన్ చార్జి అడిషనల్ కలెక్టర్లు వైవీ.గణేశ్, మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు.