హైదరాబాద్: తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం (నవంబర్ 23) సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు మంత్రి పొన్నం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇచ్చిందన్నారు.
మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు , సోలార్ ప్లాంట్లు ,బస్సులు ఇచ్చామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి బొట్టుపెట్టి మహిళా సంఘాల వాళ్ళు చీరలు ఇస్తున్నారన్నారు.మహిళలు ఆర్థిక వృద్ధి సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ఎక్కడ మహిళా సంఘాల మీటింగ్ జరిగిన హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని చెప్పండని సూచించారు. త్వరలోనే మండలానికి ఒక కాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్ రాబోతుందని.. డాక్టర్లే వచ్చి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోతామని విజ్ఞప్తి చేశారు.
నాకు ఒక అక్క చెల్లె ఉన్నారు.. మా ఆడబిడ్డలతో సమానంగా మిమ్మల్ని చూసుకుంటా.. మీకు ఏ కష్టం రానివ్వనని భరోసా ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ఒక్కో మెట్టు పూర్తి చేసుకుంటున్నామన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు. ప్రాజెక్టులో భూమి కోల్పోయిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
