వివాహేతర సంబంధాలపై చట్టం రాసినోడే తప్పు చేశాడు
ఇది తప్పు అని చెప్పేటోడే తప్పు చేశాడు. చట్టం కూడా రాశాడు. అతడు రాసిన చట్టం కిందే శిక్ష అనుభవించాడు. అవును మరి, వివాహేతర సంబంధాలకు పాల్పడితే కొరడా దెబ్బలే శిక్ష అని పేర్కొంటూ చట్టం చేసిన ఆ మత పెద్దే.. వివాహేతర సంబంధం పెట్టుకుని శిక్షకు గురయ్యాడు. ఇండోనేసియాలోని ఎకీ ఉలేమా కౌన్సిల్ (ఎంపీయూ) సభ్యుడైన ముఖ్లిస్ బిన్ మహ్మద్.. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసిన ఎంపీయూ పెద్దలు.. జనం ముందే ముఖ్లిస్కు 28 కొరడా దెబ్బలు, ఆ మహిళకు 23 కొరడా దెబ్బల శిక్ష విధించారు.
ఎకీలో సంప్రదాయాలను చాలా కఠినంగా పాటిస్తారట. షరియా చట్టాలను అమలు చేస్తారట. ‘‘ఇది దేవుడి చట్టం. తప్పు చేసినట్టు తేలితే ఎవరైనా సరే శిక్షను అనుభవించాల్సిందే’’ అని ఎకీ బేసర్ జిల్లా డిప్యూటీ మేయర్ హుస్సేని వాహబ్ చెప్పారు. ఓ టూరిస్ట్ బీచ్ వద్ద కారులో మహిళతో ఏకాంతంగా ఉన్న అతడిని సెప్టెంబర్లో అధికారులు పట్టుకున్నారని, దీంతో అతడికి గురువారం శిక్ష విధించామని హుస్సేని చెప్పారు. ముఖ్లిస్ను ఎంపీయూ నుంచి బహిష్కరిస్తామన్నారు. 2005 నుంచి షరియా చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎకీలో ఓ మత పెద్దకు బహిరంగంగా ఈ శిక్ష విధించడం ఇదే మొదటి సారి.