జకర్తా: తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో అదరగొట్టాడు. మెన్స్ డబుల్స్లో తన పార్ట్నర్ చిరాగ్ షెట్టితో కలిసి వరల్డ్ నంబర్వన్ జోడీకి షాకిస్తూ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో ఏడోసీడ్ సాత్విక్–చిరాగ్ జంట 21–13, 21–13తో టాప్సీడ్ ఫజర్ అల్ఫియాన్–మహమ్మద్ రియాన్ అడ్రియాంటో (ఇండోనేసియా)ను వరుస గేమ్స్లో చిత్తు చేసింది 41 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ జోడీ అద్భుతమైన షాట్లతో చెలరేగింది. తిరుగులేని బేస్లైన్ గేమ్తో పాటు సుదీర్ఘమైన ర్యాలీలతో ఆకట్టుకుంది. 4–0తో తొలి గేమ్ను మొదలుపెట్టిన సాత్విక్–చిరాగ్ మధ్యలో కాస్త తడబడ్డారు. దీంతో ఇండోనేసియా జోడీ 5–5, 6–6తో స్కోరు సమం చేసింది. ఈ దశలో క్రాస్ కోర్టు విన్నర్స్ కొట్టిన సాత్విక్ వరుసగా రెండు, ఆరు పాయింట్లు రాబట్టడంతో స్కోరు14–6కు పెరిగింది. ఈ దశలో మూడు పాయింట్లు కోల్పోయినా.. వెంటనే చిరాగ్ మరో మూడు పాయింట్లు సాధించి లీడ్ను 17–10కి పెంచాడు. ఇక్కడి నుంచి ఇండియన్ ద్వయం బలమైన స్మాష్లతో ఈజీగా గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో ఫజర్–రియాన్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురుకావడంతో స్కోరు 3–3, 5–5, 6–6, 7–7తో ఈక్వల్ అయ్యింది. అయితే ప్రత్యర్థుల నుంచి పోటీని ఊహించిన సాత్విక్–చిరాగ్ బేస్లైన్ గేమ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 11–7తో బ్రేక్కు వెళ్లారు. విరామం తర్వాత కూడా ఇండియన్ జంట ఆధిపత్యమే కొనసాగింది. ఇండోనేసియా జంట ఒక్కో పాయింట్తో ముందుకొస్తే, సాత్విక్–చిరాగ్ 4, 3, 3 పాయింట్లతో 20–10 ఆధిక్యంలో నిలిచారు. లాస్ట్లో సూపర్ డ్రాప్తో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
పోరాడి ఓడిన శ్రీకాంత్
మెన్స్ సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 14–21, 21–14, 12–21తో లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. గంటా 9 నిమిషాల మ్యాచ్లో శ్రీకాంత్ బాడీ లైన్ స్మాష్లతో చైనీస్ ప్రత్యర్థిని కట్టడి చేసే ప్రయత్నం చేసి ఫెయిలయ్యాడు. 2–0 లీడ్తో తొలి గేమ్ను మొదలుపెట్టిన శ్రీ క్రమంగా వెనుకబడ్డాడు. రెండో గేమ్ ఆరంభంలోనే 5–5తో స్కోరు సమమైన తర్వాత తెలుగు ప్లేయర్ బలమైన స్మాష్లతో చెలరేగాడు. బ్రేక్ టైమ్కు 11–6 లీడ్లోకి వచ్చిన శ్రీ తర్వాత వరుస పాయింట్లతో హోరెత్తించి గేమ్ను గెలిచాడు. డిసైడర్లో శ్రీ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో విరామం వరకు ఫెంగ్ ఐదు పాయింట్ల లీడ్లోకి వెళ్లాడు. ఈ టైమ్లో గాయంతో బాధపడ్డ ఫెంగ్ ఎడమ కాలుకు పెద్ద బ్యాండేజ్ కట్టుకుని కోర్టులోకి వచ్చాడు. అయినా శ్రీకాంత్కు ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా ఫెంగ్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి లీడ్ను 16–8కి పెంచుకున్నాడు. ఈ గ్యాప్ను అధిగమించడంలో విఫలమైన శ్రీకాంత్ మ్యాచ్ను చేజార్చుకున్నాడు. మరో మ్యాచ్లో ఏడోసీడ్ ప్రణయ్ 21–18, 21–16తో మూడోసీడ్ కొడాయ్ నరోకా (జపాన్)పై గెలిచాడు. 55 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ ర్యాలీలతో ఆకట్టుకున్నాడు. సెమీస్లో
ప్రణయ్.. టాప్సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)తో తలపడతాడు.