న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్కు కిందటి నెలతో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో రూ. 2,298 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే 17.3 శాతం పెరిగింది. రూ.2,278 కోట్ల నికర లాభం వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇచ్చిన లోన్లు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 20 శాతం పెరగగా, డిపాజిట్లు 13 శాతం వృద్ధి చెందాయి. వడ్డీ మార్జిన్ (లోన్లపై వచ్చిన వడ్డీ మైనస్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ) 2022 డిసెంబర్ క్వార్టర్లో 4.27 శాతం ఉండగా, తాజా క్యూ3 లో 4.29 శాతానికి పెరిగింది.
కాగా, ఇండియన్ బ్యాంకులు ఇస్తున్న లోన్లు రెండంకెల వృద్ధి సాధిస్తున్నప్పటికీ, డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కూడా పెరుగుతోంది. దీంతో వడ్డీ మార్జిన్స్పై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ మార్జిన్స్ వరుసగా రెండో క్వార్టర్లో కూడా తగ్గడం చూశాం. ఇండస్ఇండ్ బ్యాంక్కు క్యూ3 లో రూ. 5,296 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో ఈ నెంబర్ రూ.4,495 కోట్లుగా ఉంది. ప్రొవిజన్లు, కాంటింజెన్సీల కోసం బ్యాంక్ కేటాయించిన ఫండ్స్ 12.3 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) తగ్గి రూ.934 కోట్లుగా రికార్డయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు గురువారం 1.71 శాతం నష్టపోయి రూ.1,616 దగ్గర ముగిశాయి.