దేశంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వేల సంఖ్యలో తన ఉద్యోగులను ఇంటికి పంపించేస్తోంది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్లు, మధ్య స్థాయి ర్యాంక్లు కలిగిన ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసేస్తున్నట్టు తెలిసింది. సీనియర్ మేనేజర్ల స్థాయి ర్యాంక్ కలిగిన జాబ్ లెవల్ 6లో 2,200 మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు ఓ ఇంగ్లీష్ పేపర్ రిపోర్ట్ చేసింది. కంపెనీలో జాబ్ లెవల్ 6, 7, 8 బ్యాండ్స్లో కలిపి మొత్తంగా 30,092 మంది ఉద్యోగులున్నారు. జాబ్ లెవల్ 3 లేదా దాని కంటే కింద లెవల్, జాబ్ లెవల్స్ 4, 5ల్లో కంపెనీ 2 శాతం నుంచి 5 శాతం వర్క్ఫోర్స్ను తీసేస్తోంది. అంటే 4 వేల మంది నుంచి 10 వేల మంది ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసేస్తున్నట్టు తెలిసింది. కంపెనీలో 86,558 మంది ఉద్యోగులు అసోసియేట్ స్థాయిలో, 1.1 లక్షల మంది ఉద్యోగులు మిడిల్ బ్యాండ్లో ఉన్నారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హోదాలు కలిగిన 971 మందిలో సుమారు 50 మందికి పింక్ స్లిప్లు ఇస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. ఉద్యోగుల కోత ప్రక్రియ వ్యాపారాల్లో సాధారణంగా జరిగే అంతర్గత ప్రక్రియేనని ఇన్ఫోసిస్ చెప్పింది. అయితే ఇలాంటి లేఆఫ్స్ ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులను తీసేదని, కానీ ఇప్పుడు తీసేస్తోన్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపాయి. ట్రెడిషినల్ సపోర్ట్ సర్వీసులను అందజేయడానికి ఆటోమేషన్ వల్ల తక్కువ మంది ఉద్యోగులు అవసరం పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఇన్ఫోసిస్ లేఆఫ్స్ గురించి కామెంట్ చేయడానికి పెద్దగా ఇష్టపడదు. అలాంటిది గత రెండు క్వార్టర్ల నుంచి కంపెనీ దీనిపై బహిరంగంగానే మాట్లాడుతోంది. జూన్ క్వార్టర్లో ఇన్వాలెంటరీ అట్రిషన్(లేఆఫ్స్) అంతకుముందటి ఏడాది క్వార్టర్తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని సీఓఓ ప్రవీణ్ రావు చెప్పారు. టెక్ సర్వీసుల్లో అట్రిషన్ 19.4 శాతం, వాలంటరీ అట్రిషన్ 18 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
క్యాప్జెమినీ కూడా….
ఫ్రెంచ్ మల్టినేషనల్ టెక్ సర్వీసుల కంపెనీ క్యాప్జెమినీ కూడా ఇండియాలో సుమారు 500 మంది ఉద్యోగులను తీసేసింది. ప్రాజెక్ట్స్లో గ్రోత్ తక్కువగా ఉండటంతో ఉద్యోగులపై వేటు వేసింది. క్యాప్జెమినీ లాంటి పెద్ద కంపెనీల్లో డిపార్చర్లు, రీస్కిలింగ్, హైరింగ్, రీఅసైన్మెంట్లు ఒక భాగమని పేర్కొంది. ఈ టెక్నాలజీ కంపెనీకి ఇండియాలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగానికి పైగా ఇక్కడే ఉన్నారు. అయితే ఇండియాలో నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉందని, ప్రతేడాది కొత్త వారిని నియమిస్తున్నామని కంపెనీ చెప్పింది. ఇండియన్ టెక్ సర్వీసెస్ సెక్టార్ రెవెన్యూలను పెంచుకోవడంలో తీవ్ర సతమతమవుతూ ఉంది.