
- క్యూ2లో రూ.7,364 కోట్ల నికర లాభం.. షేరుకి రూ.23 డివిడెండ్
- రూ.44,490 కోట్ల రెవెన్యూ
- 2025–26 లో 20 వేల ఫ్రెషర్లను నియమించుకోవాలని టార్గెట్
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ2)లో రూ.7,364 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.2శాతం ఎక్కువ. మార్జిన్స్ పెరగడం, కొత్త డీల్స్, క్యాష్ ఫ్లో మెరుగవ్వడంతో ప్రాఫిట్ పెరిగిందని ఇన్ఫోసిస్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ షేరుకి రూ.23 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ క్యూ2 లో ఏడాది లెక్కన 8.6శాతం వృద్ధి చెంది రూ.44,490 కోట్లకు ఎగిసింది. స్థిరమైన కరెన్సీ వాల్యూ వద్ద వృద్ధి ఏడాది లెక్కన 2.9శాతంగా నమోదైంది. క్వార్టర్ ప్రాతిపదికన 2.2శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ మార్జిన్ 21శాతంగా ఉంది. ఇది గత ఏడాది కూడా ఇదే స్థాయిలోనే ఉంది.
రెవెన్యూ గైడెన్స్ తగ్గింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ గైడెన్స్ను కంపెనీ 2–3శాతానికి తగ్గించింది. కానీ మార్జిన్ మాత్రం 20–22శాతం వద్ద కొనసాగుతుందని తెలిపింది. ‘‘ రెండు వరుస క్వార్టర్లలో బలమైన వృద్ధి సాధించాం. ఇది మా స్థాయిని సూచిస్తోంది. క్యూ2లో వచ్చిన డీల్స్లో 67శాతం నెట్ న్యూ డీల్స్ కాగా, మొత్తం విలువ 3.1 బిలియన్ డాలర్లు.
అయితే కొత్త డీల్స్ విలువ క్వార్టర్ ప్రాతిపదికన 18.4శాతం తగ్గింది. క్యూ2 తర్వాత 1.6 బిలియన్ డాలర్ల విలువైన మెగా డీల్ ఒకటి క్లోజ్ అయింది” అని ఇన్పోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు. సీఎఫ్ఓ జయేష్ సంగ్రాజ్కా మాట్లాడుతూ, కంపెనీ రూ.9,677 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించిందని చెప్పారు. ఇది ఏడాది లెక్కన 38శాతం పెరిగిందని, నికర లాభానికి 131శాతం సమానమని అన్నారు. రూ.18 వేల కోట్ల ఇన్ఫోసిస్ షేరు బైబ్యాక్ ఉంటుందని ఆయన అన్నారు.
కంపెనీ ఉద్యోగుల సంఖ్య క్యూ2 లో 8,203 పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో 12 వేల ఫ్రెషర్స్ను తీసుకుంది, మొత్తం సంవత్సరంలో 20 వేల మంది ఫ్రెషర్స్ను నియమించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 3,32,000 ఉంటుంది. ఇన్ఫోసిస్ తన క్లయింట్ల అవసరాలను తీర్చేందుకు ఇన్ఫోసిస్ ఏఐ ఫస్ట్, టొపాజ్ ఫ్లాట్ఫామ్లపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది.