ఆయిల్​పామ్​ సాగుపై దృష్టి పెట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్​

ఆయిల్​పామ్​ సాగుపై దృష్టి పెట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: రైతులు ఆయిల్​పామ్​సాగుపై దృష్టిపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం హుస్నాబాద్​లో ఆయిల్​పామ్​సాగుపై  నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్​మనుచౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్​పామ్​సాగు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.ఎకరాకు రూ.42 వేలు సబ్సిడీ నాలుగేళ్ల వరకు వస్తాయన్నారు. తర్వాత రూ.60 వేల నుంచి రూ. లక్షా 50 వేల వరకు వస్తాయన్నారు.

గత ప్రభుత్వం ఆయిల్ పామ్​ఫ్యాక్టరీ తెస్తే తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తామన్నారు. హుస్నాబాద్ కేంద్రంగా ఆయిల్ కొనుగోలు చేస్తామని చెప్పారు. క్వింటాలు కు రూ.7వేల వరకు పెంచామన్నారు. ఖమ్మం జిల్లాకు మించి మన దగ్గర ఆయిల్ పామ్​ సాగు చేయాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాల్వలను పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనదన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ

అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎవరైన డబ్బులిస్తే ఇల్లిప్పిస్తామని చెబితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.​ హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.అర్హత లేకున్నా లిస్టులో పేరుంటే క్యాన్సిల్​ చేస్తామన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. తనను కలవడానికి ఎలాంటి అపాయింట్​మెంట్​అవసరం లేదని నేరుగా కలవవచ్చన్నారు. కార్యక్రమంలో ఆయిల్​పామ్​ కార్పొరేషన్​ చైర్మన్​ రాఘవ రెడ్డి, లైబ్రరీ చైర్మన్​ లింగమూర్తి, అడిషనల్​ కలెక్టర్​గరిమ అగర్వాల్, ఆర్డీవో రామ్మూర్తి, కమిషనర్​మల్లికార్జున్, ఏఎంసీ చైర్​పర్సన్​నిర్మల, వైస్​ చైర్మన్​తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.