బషీర్బాగ్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను తీసుకొచ్చి బీసీలను అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు , రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు ఆశచూపి , ఇప్పుడు 22 శాతానికి పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, రహదారులు దిగ్బంధం చేయాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిది.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే జనరల్ స్థానాల్లో బీసీలను పోటీకి నిలబెట్టాలని, డెడికేటెడ్, సుదర్శన్ రెడ్డి కమిషన్ల నివేదికలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో-ఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, టి.రాజ్ కుమార్, జి.అంజి, రాజేందర్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
